ప్రతిరోజూ పోలీస్ స్టేషన్కు వచ్చి సంతకం పెడుతున్న జగన్ మేనమామ
హైదరాబాద్: ఓ భూవివాదం కేసులో నిందితుడిగా ఉన్న కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే, వైయస్ రాజశేఖరరెడ్డి బావమరిది రవీంద్రనాథ్ రెడ్డి, నిత్యం మాదాపూర్ పోలీసు స్టేషన్కు వచ్చి సంతకం పెట్టి వెళుతున్నారు. ఆదివారం కూడా ఆయన స్టేషన్కు రావడం విశేషం. కోర్టు ఆదేశాల మేరకు గత పది రోజులుగా ఆయన నిత్యం మాదాపూర్ పీఎస్లో హాజరు వేయించుకుంటున్నారు.
హైదరాబాద్లో కబ్జా: కోర్టులో లొంగిపోయిన జగన్ మేనమామ రవీంద్రనాథ్
ఇదీ కేసు..
మాదాపూర్లో సర్వే నెంబర్ 11/30లో ప్లాట్ నెంబరు 864లో 300 చదరపు గజాల స్థలం ఉంది. ఆ స్థలం మెహిదీపట్నం ప్రాంతానికి చెందిన దామలచెరువు ప్రమీల అనే వృద్ధురాలు పేరిట రిజిస్టరయి ఉంది. ఈ ఆస్తి పైన కొందరి కన్ను పడింది. అంగబలం, అర్ధబలంతో ఆక్రమించాలని చూసి విఫలమయ్యారు.
అదే సమయంలో కర్నూలు జిల్లాకు చెందిన శీనం ప్రతాప్ రెడ్డి, గోపవరపు నర్సింహా రెడ్డి, రాజిరెడ్డితోపాటు హైదరాబాద్ ఆల్వాల్కు చెందిన ప్రతాప్ రెడ్డిలు రంగంలోకి దిగారు. ఆ స్థలానికి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారు. ఫోర్జరీ సంతకాలు చేశారు. స్థలం తమదేనని ప్రకటించుకున్నారు.
చుట్టు పక్కల ఉన్న ప్లాట్లను కూడా కలిపేసుకున్నారు. ఫోర్జరీ పత్రాలను ఆధారంగా చేసుకుని ఆ స్థలాన్ని రవీంద్రనాథ్ రెడ్డి బినామీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. శీనం ప్రతాప రెడ్డి ముఠాకు రవీంద్రనాథ్ రెడ్డి కుమారుడి బ్యాంకు ఖాతా ద్వారా రూ.25 లక్షలు చెల్లించి భూమిని కొనుగోలు చేసినట్లుగా చూపించారు.
అయితే, అసలు యజమాని దామర చెరువు ప్రమీల న్యాయం కోసం అడిగితే బెదిరించారు. దీంతో బాధితురాలు 2012 ఏప్రిల్ 7న మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగేళ్ల తర్వాత ఇటీవల పోలీసులు కొందర్ని అరెస్టు చేశారు. ఈ కేసులో గత నెల 23న రవీంద్రనాథ్ రెడ్డికి కోర్టు షరతులతో కూడిన బెయిలును మంజూరు చేసింది. ఆనాటి నుంచి ఆయన స్టేషనులో సంతకం చేస్తున్నారు.