"జగన్ ఉచ్చులో చంద్రబాబు, జగన్- పవన్ వెనక బిజెపి లేదు"
న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉచ్చులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిక్కుకున్నారని బిజెపి పార్లమెంటు సభ్యుడు, రాష్టాధ్యక్షుడు కంభంపాటి హరిబాబు వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా పేరుతో బిజెపి, టిడిపిల మధ్య చిచ్చు పెట్టి రెండు పార్టీలను విడగొట్టాలని జగన్ ఉచ్చు పన్నారని, అందులో చంద్రబాబు ఇరుక్కున్నారని ఆయన అన్నారు.
ఎన్డీఎ నుంచి టిడిపి వైదొలిగి కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు పవన్ కల్యాణ్, జగన్లను బిజెపి నడిపిస్తోందనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు.
పవన్ కల్యాణ్ అలా మాట్లాడినప్పుడు
కాకినాడ సభలో పవన్ కల్యాణ్ తమ పార్టీని విమర్శించినప్పుడు ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదని, ఈ రోజు అదే నేతను తమ పార్టీకి అంటగట్టడం దారుణమని హరిబాబు అన్నారు.
జగన్ అందుకే అలా చేశాడు
బిజెపి, టిడిపి పొత్తు పెట్టుకోవడం వల్లనే 2014 ఎన్నికల్లో జగన్ ఓడిపోయారని, అందువల్ల హోదాను తెర మీదికి తెచ్చి బిజెపి, టిడిపి విడిపోయే విధంగా జగన్ చేశారని హరిబాబు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఎ నుంచి వైదొలడం, కేంద్రం రాష్ట్రానికి ఏమీ చేయలేదని అనడం ఆశ్చర్యకరమని అన్నారు.
వారిద్దరు విమర్శించడం లేదా...
ప్రధాని నరేంద్ర మోడీని పవన్ కల్యాణ్, జగన్ విమర్శించడం లేదని టిడిపి అనడం ఆశ్చర్యంగా ఉందని హరిబాబు అన్నారు. వారిద్దరు మోడీని తిడుతుంటే సంంతోషింంచాలని అనుకుంటున్నారా అని అడిగారు.
అవిశ్వాసాన్ని ఓడిస్తాం...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సాయం చేస్తోందని కంభంపాటి హరిబాబు అన్నారు. అవిశ్వాసాన్ని ఎదుర్కొని ఓడిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్టానికి ఎంతో సాయం చేశామని, ఎన్నో సంస్థలు రాష్ట్రానికి ఇచ్చామని ఆయన చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేసిందని అన్నారు.