బాబూ! అంత భయమెందుకో? కర్ణాటకలో కాంగ్రెస్కు మేలు చేస్తున్నారా?: హరిబాబు, మోడీ వరమే ‘పోలవరం’
విశాఖపట్నం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ కంభంపాటి హరిబాబు తీవ్రంగా స్పందించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీ కలవాలని చూస్తోందని సీఎం చంద్రబాబు అంటున్నారని.. అయితే, ముఖ్యమంత్రి అంతగా ఎందుకు భయపడుతున్నారో తనకు తెలియదని వ్యాఖ్యానించారు.
బీజేపీపై నిందలా?
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల వ్యూహంపై బీజేపీలో ఇప్పటి వరకూ చర్చ జరగలేదన్నారు. బీజేపీని రాష్ట్రంలో బలోపేతం చేయడంపైనే దృష్టి పెట్టామని తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో ఏమి చేయలేని టీడీపీ ప్రభుత్వం బీజేపీపై నిందలు వేస్తూ పబ్బం గడుతుంతోదని ఆరోపించారు. వైయస్సార్ సీపీ ఎమ్మెల్యేలను ప్రభుత్వంలోని తీసుకుని చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుతున్నారని విమర్శించారు.
బాబూ ఎందుకంత భయం?
‘చంద్రబాబు పదే పదే కేసుల విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నారు? ఏదైనా తప్పు జరిగిందా అనే అనుమానం కలుగుతోంది. చంద్రబాబు గురించి కేంద్ర పెద్దలు ఎవరూ మాట్లాడటం లేదు. మరి కేసులంటూ చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు' అని కంభంపాటి ప్రశ్నించారు.
మోడీ వరం పోలవరం
‘పోలవరం తెలుగు ప్రజలకు నరేంద్ర మోడీ ఇచ్చిన వరం. ముంపు మండలాలను ఏపీలో కలిపినందునే పోలవరం ముందుకెళ్తొంది' అని హరిబాబు గుర్తు చేశారు. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే విజయవాడలో చేసిన వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయం కాదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమేనని హరిబాబు అన్నారు.
కాంగ్రెస్కు మేలు చేస్తారా?
కాంగ్రెస్కు దగ్గర కావాలని చంద్రబాబు చూస్తున్నారని హరిబాబు ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి రాకుండా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అది కాంగ్రెస్కు మేలు చేసినట్లవుతుందన్నారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్కి టీడీపీ ఎలా మద్దతిస్తుంది? అని ప్రశ్నించారు. అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన పార్టీలు మోడీని విమర్శిస్తున్నాయని, వారితో చంద్రబాబు ఎలా చేతులు కలుపుతారని హరిబాబు ధ్వజమెత్తారు.