సీఎం జగన్ పై కేశినేని నానీ ట్వీట్ ... మీరు చాలా చాలా గ్రేట్ సార్ అన్న నానీ
Recommended Video
టీడీపీ ఎంపీ కేశినేని నాని మరోసారి సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. గత కొంతకాలంగా కేశినేని తాను చెప్పాలనుకునే ప్రతి విషయాన్ని సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తున్నారు. నిన్నటికి నిన్న పార్టీలో షో చేసే వాళ్ళు అవసరం లేదని పని చేసే నాయకులు కావాలని సొంత పార్టీ నేతలపై సెటైర్లు వేసిన నానీ ఇప్పుడు వైసీపీ అధినేత, సీఎం జగన్ ను టార్గెట్ చేసి సెటైర్లు వేశారు.
ఏపీలో ప్రజలంతా ప్రత్యేక హోదా కోసం ఆశగా ఎదురు చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనని తేల్చి చెప్పింది . ఇక ప్రత్యేక హోదా ఇచ్చేదే లేదంటూ కేంద్రం తెగేసి చెప్పడంతో సీఎం జగన్తో పాటు వైసీపీ నేతలపై టీడీపీ నేతలు సెటైర్ల మీద సెటైర్లు వేస్తున్నారు . తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్ పేర్కొనడంపై ఎంపీ కేశినేని నానీ కౌంటర్ ఇచ్చారు. ''కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి బడ్జెట్లో రూ.21 కోట్లు సాధించిన గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి గారూ.. మీరు, మీ 22 మంది ఎంపీలు చాలా చాలా గ్రేట్ సార్'' అని కేశినేని నాని ట్వీట్ చేశారు.
ఇటీవల ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపారని, ప్రత్యేక హోదా గురించిన ప్రస్తావనే లేదని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. జగన్ ఇప్పుడేమి చేస్తారని ప్రశ్నిస్తున్నారు.కేంద్ర బడ్జెట్ లో ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకపోవడంతో టీడీపీ నేతలు జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రత్యేక హోదా లేదు, కనీసం అభివృద్ధికి నిధులు కూడా తెలీని అసమర్థులని ఎద్దేవా చేస్తున్నారు . ఇక కేంద్ర బడ్జెట్ లో కేవలం రూ.21 కోట్లు మాత్రమే ఇచ్చారని కేంద్రం మెడలు వంచుతామని చెప్పిన జగన్ ఏం చేశారని కేశినేని నానీ పోస్ట్ ద్వారా ప్రశ్నించారు. ఇక ఇంతటి ఘనత సాధించిన మీరు , మీ ఎంపీలు చాలా గ్రేట్ అని వ్యంగ్యంగాపోస్ట్ పెట్టారు కేశినేని నానీ .