పార్ట్టైమ్ క్రిమినల్ ప్రతిపక్ష నేతగా ఉన్నాడు: జగన్ను ఉద్దేశించి కామినేని తీవ్ర వ్యాఖ్య
కృష్ణా: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపి ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి కామినేని శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్ట్టైమ్ క్రిమినల్ ప్రతిపక్ష నేతగా ఉండటం ప్రజల దురదృష్టమని జగన్ను ఉద్దేశించి పరోక్షంగా విమర్శించారు.
విపక్షం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని మంత్రి హితవు పలికారు. కృష్ణా జిల్లాలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరులో వైద్య శిబిరాన్ని మంత్రి కామినేని శ్రీనివాస్ బుధవారం సందర్శించారు. గ్రామంలో ఎటువంటి విషజ్వరాలు లేవని మంత్రి అన్నారు. ప్రతిపక్ష నేత జగన్ లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
వైద్యసౌకర్యాల విషయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుందని తెలిపారు. ప్రైవేటు మెడికల్ కళాశాలల్లో కన్వీనర్ కోటా సీట్లను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని శ్రీనివాస్ హెచ్చరించారు. అవసరమైతే ఎంసీఐతో చర్చించి కాలేజీ గుర్తింపును రద్దు చేస్తామన్నారు.
కన్వీనర్ కోటా కింద సీటు తీసుకొని వదిలివేస్తే విద్యార్థుల సర్టిఫికెట్లను హోల్డ్లో పెడతామని మంత్రి ప్రకటించారు. విద్యార్థులను డిబార్ చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని మంత్రి వివరించారు.
ఆగస్టు చివరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు: మంత్రి దేవినేని
ఆగస్టు చివరి వరకు కృష్ణా ప్రాజెక్టులకు నీరు వస్తుందని ఆశిస్తున్నామని రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు అన్నారు. పంటలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు.
50 లక్షల ఎకరాల్లో పంటలు వేశారని, ఇప్పటివరకు మైనస్ 8 శాతం వర్షపాతం లోటు ఉందన్నారు. ఆగస్టు 15 నుంచి పట్టిసీమ ఎత్తిపోతల నుంచి 2,500 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలిస్తామని మంత్రి తెలిపారు.