ఆ పాపం గాంధీలదే: ప్రత్యేక హోదాపై కామినేని, 'మోడీ కన్నా బాబు గొప్ప'
విజయవాడ: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవటం వల్లనే కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోందని, ఈ పాపం సోనియా, రాహుల్దేనని మంత్రి కామినేని శ్రీనివాస్ విమర్శించారు.
విజయవాడలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కన్నా ఎక్కువ ప్రయోజనాలనే కేంద్రం ఏపీకి ఇస్తుందన్న నమ్మకం ఉందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మెడికల్ సీట్లను అక్రమంగా అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని మరోసారి స్పష్టం చేశారు. విశాఖలో స్వైన్ఫ్లూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
కాగా, ప్రధాని నరేంద్ర మోడీ కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడే గొప్ప వ్యక్తి అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. చంద్రబాబు ప్రతిష్టకు భంగం కలిగే ఏ పని బిజెపి చేసినా టిడిపి కార్యకర్తలు సహించరని ఆయన హెచ్చరించారు.
బిజెపి వల్ల తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ట దెబ్బ తింటోందని వెంకన్న అన్నారు. విశాఖపట్నం, నరసాపురం లోకసభ స్థానాల్లో బిజెపి గెలవడానికి చంద్రబాబు చరిష్మానే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
హీరో శివాజీని అడ్డం పెట్టడుకుని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రత్యేక హోదాపై డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిసి ప్రత్యేక హోదాపై చర్చిస్తారని ఆయన చెప్పారు.