10న నిమ్మగడ్డపై సుప్రీంకోర్టు తీర్పు.. 13న సుజనాను కలిశా: ఛాలెంజ్ చేస్తున్నా: కామినేని
అమరావతి: రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలను పుట్టించిన హోటల్ పార్క్ హయత్ ఉదంతంపై భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి కామినేని శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఆయన ఓ సెల్ఫీ వీడియోను మీడియాకు విడుదల చేశారు. పార్క్ హయత్ సమావేశాన్ని రహస్య భేటీ, దొంగల భేటీగా అభివర్ణించడాన్ని తప్పు పట్టారు. తమ పార్టీ రాజ్యసభ సభ్యుడిని కలుసుకోవడానికి వెళ్లడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.
కమ్మనైన ప్రజాస్వామ్యం: నాలుగో బిగ్బాస్ వివరాలు అతి త్వరలో..స్టే ట్యూన్డ్: సాయిరెడ్డి
నిమ్మగడ్డ వస్తున్నారని తెలియదు..
తమ పార్టీ ఎంపీ సుజనా చౌదరిని కలుసుకోవడానికి మాత్రమే తాను పార్క్ హయత్కు వెళ్లానని కామినేని స్పష్టం చేశారు. దీనికోసం సుజనా చౌదరి తనకు అపాయింట్మెంట్ ఇచ్చారని అన్నారు. అదే సమయంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సుజనా చౌదరిని కలుసుకోవడానికి వచ్చారని చెప్పారు. ఈ నెల 13వ తేదీన తాను సుజనా చౌదరిని కలుసుకోవాలని తాను భావించానని, దీనికోసం ఆయనకు ఫోన్ చేయగా.. 11:30కు పార్క్ హయత్ హోటల్లో అపాయింట్మెంట్ ఇచ్చారని, ఇదంతా అధికారికమేనని అన్నారు.
ముందుగా నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకోలేదు..
ఆ అపాయింట్మెంట్ ప్రకారమే తాను సుజనాను కలుసుకున్నానని అన్నారు. తాను అక్కడే ఉన్న సమయంలో రమేష్కుమార్ వచ్చారని చెప్పారు. అంతే తప్ప తాము ముందుగా నిర్ణయించుకుని ఏర్పాటు చేసుకున్న సమావేశం కాదని అన్నారు. రమేష్ కుమార్కు అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో తాను ఆయనకు శుభాకాంక్షలు చెప్పి, బయటికి వచ్చేశానని చెప్పారు. ఓ స్టార్ హోటల్లో, సీసీ కెమెరాల మధ్య భేటీ కావడం రహస్య సమావేశం ఎలా అవుతుందని కామినేని ప్రశ్నించారు. దీనిపై వైసీపీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.
రమేష్ కుమార్ హోదాలో లేరు..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న రమేష్కుమార్ను తాను కలవలేదని కామినేని శ్రీనివాస్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఆయన ఆ హోదాలో లేరని, అలాంటి వ్యక్తిని కలుసుకోవడం తప్పు కాదని అన్నారు. ఎన్నికల కమిషనర్గా రమేష్కుమార్ను నియమించడానికి అనేక అడ్డకులను సృష్టిస్తోన్న వైసీపీ ప్రభుత్వం.. ఇప్పుడు ఆయనను ఓ అధికారిగా చూస్తోందని అన్నారు. కేంద్ర, రాష్ట్ర పార్టీ నాయకత్వం అనుమతి తీసుకునే రమేష్ కుమార్ విషయంలో న్యాయస్థానంలో పోరాడానని చెప్పారు.
Recommended Video
మచ్చలేని నాయకుడిని..
తాను మంత్రిగా పనిచేసినా, ఎమ్మెల్యేగా గెలిచినా మచ్చ లేని రాజకీయాలను చేశానని కామినేని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎవ్వరి వద్ద కూడా ఒక్క రూపాయిని తీసుకోలేదని అన్నారు. దీనిపై తాను కైకలూరులోని మూడు ఆలయాల్లో సత్య ప్రమాణం చేశానని చెప్పారు. మంత్రివర్గం నుంచి వైదొలగిన తరువాత తన హయాంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటూ కాణిపాకం ఆలయంలో దీపాలను ఆర్పి.. తన కుటుంబ సభ్యుల సాక్షిగా ప్రమాణం చేశానని అన్నారు. ఆరుమంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, నలుగురు డీజీపీల హయాంలో తాను మంత్రిగా కొనసాగానని, వారిలో ఏ ఒక్కరితోనైనా తనను అవినీతిపరుడిగా చెప్పించగలరా? అని కామినేని సవాల్ చేశారు.