బాలుడ్ని ఎలుకలు చంపిన ఆస్పత్రిలోనే మంత్రి కామినేనికి మోకీలు శస్త్రచికిత్స
గుంటూరు: గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కుడి మోకీలు శస్త్రచికిత్స నిర్వహించారు. జీజీహెచ్ ఎముకల విభాగాధిపతి డాక్టర్ ప్రశాంత్, హైదరాబాద్ కేర్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ ప్రసాదరావు, తిరుపతికి చెందిన ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ జగదీష్, గుంటూరుకు చెందిన వైద్య నిపుణులు బి నరేందర్రెడ్డిల పర్యవేక్షణలో శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు.
రాష్ట్ర మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో మోకీలు శస్త్రచికిత్స చేయించుకోవడం ఇదే తొలిసారి. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయించున్నారు. జనవరి 24న మంత్రిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
అంతకుముందు మంత్రి కామినేని మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం కలిగించేందుకు తాను ఇక్కడ శస్త్ర చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రెగ్యూలర్గా వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకూడదని ఆదేశించినట్లు చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల సిబ్బంది బాగా పని చేస్తే అండగా ఉంటామని చెప్పిన ఆయన.. తప్పులు చేస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, కొన్ని నెలల క్రితం ఇదే ఆస్పత్రిలోనే అనారోగ్యంతో చికిత్స కోసం వచ్చిన ఓ చిన్నారిని ఎలుకలు కొరికి చంపిన విషయం తెలిసింది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో మంత్రి కామినేని సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకున్నారు.