'కమ్మరాజ్యంలో కడప రెడ్లు'పై బాంబు పేల్చిన ఆర్జీవీ.. తొలి పాట ట్రైలర్ రేపే! నేతల్లో టెన్షన్...
అమరావతి: ఎప్పుడూ వివాదాలను తన పాకెట్ లో పెట్టుకుని తిరిగే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. మరోసారి ఆయన తన ట్రేడ్ మార్క్ షాట్లు, టేకింగ్ తో మూవీని తీస్తున్నారు. కమ్మరాజ్యంలో కడప రెడ్లు పేరుతో రాష్ట్ర రాజకీయాలపై ఆయన తీసిన తాజా చిత్రం తొలి పాట ట్రైలర్ శుక్రవారం ఉదయం 9 గంటలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. మోస్ట్ నాన్ కాన్ట్రవర్సియల్ మూవీ అని దానికి ట్యాగ్ లైన్ తగిలించారు. సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్తయిందనేది ఫిల్మ్ నగర్ టాక్. ఎప్పుడు తీశాడో..ఎలా తీశాడో గానీ.. గప్ చుప్ గా సినిమాను లాగించేశారు ఆర్జీవీ. మూవీ టైటిల్ ఒక్కటే ఇంత వివాదాన్ని రేకెత్తించేలా ఉంటే.. ఇక సినిమా ఎలా ఉంటుందోననే ఆసక్తి ప్రేక్షకుల్లో వ్యక్తమౌతోంది.
రెండు బలమైన సామాజిక వర్గాల చుట్టూ..రాష్ట్రంలో రెండు బలమైన సామాజిక వర్గాలు కమ్మ, రెడ్డి. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యం, ఆధిపత్యం అధికం. ఓ రకంగా ఆ రెండు జిల్లాలు కమ్మ సామాజిక వర్గానికి కంచుకోటల్లాంటివేనని చెప్పుకోవచ్చు. కమ్మ సామాజిక వర్గం అంటే వెంటనే గుర్తుకొచ్చేది ఈ రెండు జిల్లాలే. రెడ్డి సామాజిక వర్గం అధికంగా ఉండే ప్రాంతం రాయలసీమ. రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో రెడ్డిలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు కూాడా ఈ రెండు సామాజిక వర్గాల చుట్టే నడుస్తోంది. అలాంటి జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గ నాయకులు ఎలా పాగా వేశారనే అంశాన్ని ప్రధాన కథాంశంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తీసినట్లు చెబుతున్నారు.
The most non controversial film “కమ్మ రాజ్యం లో కడప రెడ్లు " 1st Song trailer release Tmrw Friday 9th at 9 Am
— Ram Gopal Varma (@RGVzoomin) August 8, 2019
తిరుమలలో మంత్రి కొడాలి నాని: నెరవేరిన కోరికలు: ప్రమాణ స్వీకారం తరువాత తొలిసారిగా!
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం నాడే టైటిల్ ప్రకటన..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వచ్చిన సందర్భంగా.. విజయవాడ సహా, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నెలకొన్న తాజా పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన రామ్ గోపాల్ వర్మ.. అప్పటికప్పుడు ఈ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. కమ్మ సామాజిక వర్గం అధిక సంఖ్యలో నివసించే ఈ రెండు జిల్లాల్లో రాయలసీమ జిల్లాలకు చెందిన రెడ్లు పెద్ద సంఖ్యలో కనిపించడం తనకు ఆశ్చర్యానికి గురి చేసిందని అప్పట్లో వ్యాఖ్యానించారాయన. ఖద్దరు చొక్కా, తెల్ల పంచెలు ధరించి, తెల్ల సుమో వాహనాల్లో తిరిగే నాయకులు సాధారణంగా రాయలసీమ జిల్లాల్లో కనిపిస్తుంటారని అన్నారు. తాను గుంటూరు, కృష్ణా జిల్లాల్లో తిరుగుతుంటే రాయలసీమలో కలియ తిరుగుతున్నట్టే అనిపించిందని తెలిపారు.
విజయవాడ రోడ్లపై సీమ వాతావరణం..
కమ్మ సామాజిక వర్గ నాయకులకు చెందిన హోటల్ గేట్ వేలో రాయలసీమ రెడ్లు పెద్ద సంఖ్యలో దిగారనీ, వాటన్నింటినీ చూసి తాను కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అనే సినిమాకు కథను రాసుకున్నానని తెలిపారు. విజయవాడ రోడ్లపైనా తనకు ఇలాంటి వాతావరణమే కనిపించిందని రామ్ గోపాల్ వర్మ అప్పట్లో చెప్పుకొచ్చారు. తాను ప్రత్యక్షంగా తిలకించిన, అనుభవించిన ఉదంతాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాకు అవసరమైన కథను రాసుకున్నారట రామ్ గోపాల్ వర్మ. టైటిల్ ఎంత పవర్ ఫుల్ గా ఉందో.. సినిమా కూడా అంతే శక్తిమంతంగా ఉంటుందని చెబుతున్నారు. దసరా సెలవుల నాటికి ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
నాడు లక్ష్మీస్ ఎన్టీఆర్.. నేడు కేఆర్ కేఆర్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన చివరి సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఏ రేంజ్ లో వివాదాలను రేకెత్తించిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు ముందు ఏపీ మినహా ప్రపంచవ్యాప్తంగా విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకంపనలు సృష్టించింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పాత్రను ప్రధాన విలన్ గా ఈ సినిమాలో చూపించారు రామ్ గోపాల్ వర్మ. ఎన్టీ రామారావు ఎలా పదవీచ్యుతుడయ్యారనే విషయం చుట్టూ తిరిగిన ఈ సినిమా.. తెలుగుదేశం పార్టీ గెలుపు అవకాశాలపై కొద్దో, గొప్పో ప్రభావం చూపి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం విజయవాడకు వచ్చిన రామ్ గోపాల్ వర్మను పోలీసులు బలవంతంగా తరిమేయడం అప్పట్లో పెద్ద వివాదాన్నే రేకెత్తించింది.అవకాశాలు లేకపోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, కమ్మ వారిని విలన్ గా చూపించే ప్రయత్నం చేసి ఉండొచ్చని అంటున్నారు. అదే జరిగితే- ఈ సినిమా కాస్త వైఎస్ జగన్ కు కొత్త తలనొప్పిని తీసుకుని రాలేదనే గ్యారంటీ లేదు. ఈ సినిమాను అడ్డు పెట్టుకుని కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగుదేశం నాయకులు ఆందోళనలను చేపట్టడానికి అవకాశం ఉందని, ఫలితంగా- శాంతిభద్రతల సమస్య తలెత్తడం ఖాయమని అంటున్నారు.