అసలేమైంది?: బెజవాడ దుర్గమ్మకు ఇచ్చిన చీర మాయం!: ఫిర్యాదు చేయలేమని అధికారులు!
విజయవాడ: బెజవాడ కనకదుర్గగుడిలో అమ్మవారికి సారె రూపంలో వచ్చిన చీర మాయమైన ఘటనలో ఎలాంటి పురోగతి లేకుండా పోతోంది. ఘటనపై విచారణ విషయంలో పోలీసులు, దుర్గగుడి అధికారులు సాకులతో కాలయాపన చేస్తున్నారు తప్ప ముందుకు కదలడం లేదు.
భక్తులు చీర తెచ్చినట్లు రికార్డుల్లో నమోదు కానందున పోలీసులకు ఫిర్యాదు చేయలేమని దుర్గగుడి అధికారులు చెబుతుండటం గమనార్హం. అదే సమయంలో తమకు భక్తుల నుంచి గానీ, అధికారుల నుంచి గానీ ఫిర్యాదు రానందున కేసు నమోదు చేయలేదని పోలీసులు అంటున్నారు.
కాగా, విషయం తెలిసిన వెంటనే దుర్గగుడికి వచ్చిన పోలీసులు.. భక్తులు, అర్చకులు, పాలకమండలి సభ్యులను విచారించారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. ఆ తర్వాత మాత్రం చర్యలకు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. నిబంధనల మేరకు ఫిర్యాదు వస్తేనే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేస్తున్నారు.
ఇది ఇలావుంటే, అమ్మవారికి ఆ చీర సమర్పించిన భక్తులు సూర్యనారాయణ, వసుంధర మాత్రం పాలకమండలి సభ్యుడు పెంచలయ్య విజ్ఞప్తి మేరకే తాము పోలీసులకు ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులకు చెప్పినా పట్టించుకోకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఇచ్చిన కానుకలు ప్రముఖ పుణ్యక్షేత్రంలోనే ఇలా మాయమవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.