కనక దుర్గమ్మ ముక్కుపుడకకు ఎసరు: తస్కరించబోయి..రెడ్ హ్యాండెడ్గా చిక్కి!
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆలయంలో పనిచేస్తోన్న ఉద్యోగి ఒకరు తన చేతివాటాన్ని ప్రదర్శించారు. భక్తులు హుండీలో వేసిన కానుకలను తస్కరించబోయాడు. అధికారుల చేతికి చిక్కాడు. సుమారు ఎనిమిది తులాల బరువు ఉన్న బంగారాన్ని చోరీ చేయడానికి విఫలయత్నం చేశాడు. అతని పేరు సింహాచలం. కొంతకాలంగా దుర్గగుడిలో శాశ్వత ఉద్యోగిగా హుండీ కానుకల లెక్కింపు విభాగంలో పనిచేస్తున్నాడు. అతని భార్య దుర్గ కూడా ఆలయ ఉద్యోగిణే. ఆమె కాంట్రాక్టు ప్రాతిపదికన సూపర్వైజర్గా పనిచేస్తున్నారు.
భక్తులు అమ్మవారికి హుండీల్లో వేసిన కానుకలను చోరీ చేయడానికి సింహాచలం ప్రయత్నించాడు. అమ్మవారికి భక్తులు సమర్పించిన ముక్కుపుడక, ఓ బంగారు ఆకు, రెండు చెయిన్లను తస్కరించబోయాడు. వాటిని కాగితంలో చుట్టి, తన భార్యకు అందజేశాడు. ఆ దృశ్యాలు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. వాటిని చూసిన వెంటనే అధికారులు అప్రమత్తం అయ్యారు. హుండీ కానుకల లెక్కింపు విభాగానికి చేరుకున్నారు. సింహాచలాన్ని, అతని భార్య దుర్గను అదుపులోకి తీసుకున్నారు. వారిని సోదా చేయగా.. దుర్గ వద్ద కాగితంలో చుట్టిన బంగారు వస్తువులు కనిపించాయి. వాటి బరువు సుమారు ఎనిమిది గ్రాముల మేర ఉంటుందని ఆలయ అధికారులు అంచనా వేశారు.
వెంటనే వారిని ఆలయ భద్రతా విభాగం సిబ్బందికి అప్పగించారు. వారిపై భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా- ఇదివరకు దుర్గ గుడిలో చీరలు మాయమైన విషయం తెలిసిందే. భక్తులు అమ్మోరికి ఇచ్చిన చీరెలను పెద్ద ఎత్తున చోరీ చేశారు. ఈ కేసు వ్యవహారం అతీ, గతీ లేకుండా పోయింది. చీరెలతో పాటు కొన్ని బంగారు వస్తువులు కూడా మాయమైనప్పటికీ.. ఆ వ్యవహారం పెద్దగా వెలుగు చూడలేదని తెలుస్తోంది. తాజాగా- మరోసారి చోరీ ప్రయత్నాలు చోటు చేసుకోవడం.. తక్షణమే అది బహిర్గతం కావడం చర్చనీయాంశమైంది.