దుర్గ గుడిలో రహస్య పూజలు: ఈవో సూర్యకుమారికి ప్రభుత్వం షాక్, బదలీ ఉత్తర్వులు
విజయవాడ: దుర్గ గుడిలో రహస్య పూజల వ్యవహారంలో ఈవో సూర్య కుమారిని బదలీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెను సాధారణ పరిపాలన శాఖకు ప్రభుత్వం సరెండర్ చేసింది.
దుర్గ గుడిలో వంద గ్రూప్లు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారో, వేటు తెలియదు: ఈవో సూర్యకుమారి
ప్రస్తుతం దుర్గగుడి ఇంచార్జ్ ఈవోగా దేవాదయ శాఖ కమిషనర్ అనురాధకు బాధ్యతలు అప్పగించింది. దుర్గగుడిలో పూజల వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమెను బదలీ చేయాలని సీఎం ఆదేశించారు. దీంతో ఆమెపై వేటు పడింది.
డిసెంబర్ 26న అర్ధరాత్రి పూజలు
దుర్గ ఆలయంలో డిసెంబర్ 26న అర్ధరాత్రి బద్రీనాథ్తో పాటు మరో ముగ్గురు అనధికార పూజారులు పూజలు చేయడం వెనుక ఈవో సూర్య కుమారే ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లుగా చెబుతున్నారు. మహిషాసుర మర్ధిని రూపానికే పూజలు నిర్వహించేలా ఆమె నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఆలయ ప్రధాన పూజారీ బద్రీనాథ్ బంధువుగా పేర్కొనే పార్థసారిథి ఇంతకుముందు దుర్గగుడి పూజల్లో పాల్గొనేవాడని చెబుతున్నా అతడు కేవలం మహిషాసుర మర్దిని అలంకారం రోజే వచ్చి పాల్గొనేవాడని చెబుతున్నారు.
అలంకారం చేసి ఫోటోలు పంపాలని
అలంకారం చేశాక ఫోటో తీసి ఫోన్లో తనకు పంపాల్సిందిగా ఈవో సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ ఫోటోను తాను ఎవరికో పంపాల్సి ఉందని చెప్పినట్లుగా పోలీసు దర్యాఫ్తులో వెల్లడైంది. ఫోటోను ఆమె ఎవరికి పంపదలుచుకున్నారు, ఈ వ్యవహారం వెనుక ఈవోతో పాటు ఇంకా వేరేవారి పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలోను దర్యాఫ్తు చేయనున్నారు.
ఫోన్ ఎందుకు చేశారు
పూజలో ఉన్న సమయంలో పూజారులు ఈవోతో ఫోన్లో మాట్లాడిన అంశాన్ని పోలీసులు గుర్తించారు. నాలుగు నిమిషాలకు పైగా వారు ఫోన్లో మాట్లాడుకున్నారు. కేవలం వివరాలేనా, లేక ఆ సమయంలో పూజా క్రమాన్ని ఆమెకు వినిపించేందుకు ఇలా చేశారా అన్నది దర్యాఫ్తులో తేలనుందని చెబుతున్నారు.
సంప్రదాయానికి విరుద్ధంగా
ఆలయ ప్రధాన అర్చకులు బద్రీనాథ్ ఎప్పటి నుంచో తన బంధువుకు ఉద్యోగం గురించి అడుగుతున్నారని, ఈ పూజ చేయిస్తే ఉద్యోగం ఇస్తానని ఆమె చెప్పి ఉంటారని దర్యాఫ్తులో తేలినట్లుగా సమాచారం. అగంతకులు ఆలయంలోకి ప్రవేశించారని, సంప్రదాయ విరుద్ధంగా ఆలయంలో కొన్ని కార్యక్రమాలు జరిగాయని తేలిందని పోలీసులు చెప్పారు.