కడపకు మోడీ వస్తున్నారు! అందుకే టీడీపీ దొంగ దీక్షలు: కందుల విసుర్లు, వెంకయ్యతో భేటీ
న్యూఢిల్లీ: కడపలోనే కాదు, విశాఖపట్నంలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని ఏపీ బీజేపీ నేతలు కందుల రాజమోహన్ రెడ్డి, రఘునాథ్ బాబు తెలిపారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంపై మంగళవారం ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆయన నివాసంలో కలిశారు.
వెంకయ్యతో చర్చలు
వెంకయ్యనాయుడుతో చర్చ అనంతరం కందుల రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ విషయంలో టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014 సంవత్సరంలో సెయిల్ ఇచ్చిన నివేదికలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యం కాదని చెప్పిన విషయాన్ని మాత్రమే ప్రస్తావిస్తున్నారని, చివరిపేరాలో ప్రస్తావించిన మెకాన్ సంస్థ ప్రాథమిక నివేదిక గురించి ఉద్దేశపూర్వకంగా వదిలేశారని ఆరోపించారు.
కడపకు మోడీ వస్తున్నారు.. అందుకే టీడీపీ దీక్షలు
ఇతర రాష్ట్రాల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ విశాఖలో మరో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం సిద్ధమైందని, కడపలో స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారని రాజమోహన్ రెడ్డి తెలిపారు. స్టీల్ ప్లాంట్ ఖచ్చితంగా వస్తుందన్న విషయం తెలుసు కాబట్టే టీడీపీ నేతలు దీక్షల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
అప్పుడేమో అలా.. ఇప్పుడు 6రోజులుగా దీక్షలెలా చేస్తున్నా..
టీడీపీకి చిత్తశుద్ధి ఉన్నట్లయితే 2014లో సెయిల్ నివేదిక.. స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదన్నప్పుడే ఎందుకు ధర్నాలు, దీక్షలు చేయలేదని రాజమోహన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రమేష్ సహా టీడీపీ నేతల దీక్షల్లో చిత్తశుద్ధి లేదని, పార్లమెంటులో 6గంటలకే స్పృహ కోల్పోయిన నేతలు.. ఇప్పుడు 6రోజులుగా ఎలా దీక్ష చేయగల్గుతున్నారని ఆయన ప్రశ్నించారు.
దొంగదీక్షలు-కొంగజపాలు..
బీజేపీ నేత రఘునాథ్ బాబు మాట్లాడుతూ.. రాయలసీమ వ్యక్తినంటూ చెప్పుకునే చంద్రబాబు.. సీమకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ దొంగదీక్షలు, కొంగజపాలు చేస్తోందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కేంద్రంపై అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 300మిలియన్ టన్నుల ఐరన్ ఉత్పత్తి చేయాలని కేంద్రం భావిస్తోందని, స్టీల్ ధర పెరుగుతుంది కాబట్టి తప్పకుండా స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి తీరుతుందని రఘునాథ్ బాబు స్పష్టం చేశారు.