ఆ సమయం వచ్చింది: చంద్రబాబు-స్టాలిన్ భేటీపై కనిమొళి ఆసక్తికర వ్యాఖ్యలు
చెన్నై: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ల భేటీపై డీఎంకే నేత, ఎంపీ కనిమొళి స్పందించారు. వీరిద్దరి భేటీతో కమలనాథుల గుండెల్లో దడ ప్రారంభమైందని చెప్పారు.
ప్రధాని రేసులో ఉన్నారా అంటే చంద్రబాబు ఏం చెప్పారంటే? స్టాలిన్తో గంటపాటు భేటీ
మతశక్తులను వెనుక ఉండి నడిపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలకు ఇక చరమగీతం పాడాల్సిందేనని చెప్పారు. ఎన్డీయే పాలనకు చివరి రోజులు దగ్గర పడ్డాయన్నారు. మోడీ పాలనకు చెక్ చెప్పేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీ నేతల గుండెల్లో వణుకు ప్రారంభమైందని అన్నారు.
భారత దేశంలో లౌకికవాదాన్ని కాపాడే సమయం ఆసన్నమైందని కనిమొళి చెప్పారు. రాజకీయ పార్టీలన్నీ తమ తమ విభేదాలను పక్కన పెట్టి ఒకే వేదిక పైకి రావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
శనివారం స్టాలిన్ను కలిసిన తమిళనాడు కాంగ్రెస్ వ్యవహారాల కేంద్ర పరిశీలకుడు సంజయ్దత్ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు చొరవతో ఎన్డీయే వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు త్వరలో స్టాలిన్ను రాహుల్ గాంధీ కలవబోతున్నట్టు చెప్పారు.