టీడీపీకి షాక్: కన్నబాబు రాజీనామా, నేడే జగన్ పార్టీలోకి!
అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు(ఎంవీ రమణమూర్తి రాజు) తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కన్నబాబుతోపాటు ఆయన కుమారుడు, విశాఖ డీసీసీబీ చైర్మన్ సుకుమారవర్మలు శుక్రవారం తమ రాజీనామా లేఖలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు పంపించారు.
రాష్ట్ర, రూరల్ జిల్లా అధ్యక్షులు కళా వెంకటరావు, పంచకర్ల రమేష్బాబులకు కూడా రాజీనామా లేఖలను పంపినట్టు సుకుమారవర్మ తెలిపారు. కాగా, తమ అనుచరులతో కలిసి శనివారం వైయస్ జగన్మోహనరెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు.
కన్నబాబు విశాఖపట్నం జిల్లా యలమంచిలి ఎమ్మెల్యేగా రెండు పర్యాయాలు పనిచేశారు. 2014 ఎన్నికల ముందు ఆయన టీడీపీలో చేరారు. తాజాగా కన్నబాబురాజు వైయస్సార్సీపీలో చేరతారన్న వార్తల నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధిష్టానం పలు దఫాలు ఆయనతో చర్చలు జరిపి పార్టీని వీడవద్దని ఒత్తిడి తెచ్చింది.
అయినా ఫలితం లేకపోయింది. తాను వైయస్సార్సీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నానని, ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదని టీడీపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు కన్నబాబురాజు తేల్చి చెప్పారు.