ఇల్లు మునిగిందా లేదా అన్నది తోకనేతల చర్చ .. మీ ఇద్దరి వల్ల రాష్ట్రం నిండా మునుగుతుందన్న కన్నా
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తాజా పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీపై తీవ్రంగా మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్ర ప్రజలు వరదలతో అల్లాడుతుంటే, లంక గ్రామాలు ముంపునకు గురై సహాయం కోసం ఎదురు చూస్తుంటే ప్రజల బాగోగులు పట్టించుకోని ముఖ్యమంత్రి జగన్ అమెరికా వెళ్లారని కన్నా విమర్శించారు. ఇక చంద్రబాబు హైదరాబాద్ చేక్కేశారన్నారు.
ఇక అదే సమయంలో వైసిపి మంత్రుల దృష్టంతా చంద్రబాబు ఇంటి చుట్టూనే ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద ముంపుకు గురైంది చంద్రబాబు ఇల్లు మాత్రమే కాదని, ఎన్నో గ్రామాల ప్రజలు వరదల్లో చిక్కుకుని అల్లాడుతున్నారు అని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
ప్రజల సంక్షేమం మీద అధికార పార్టీ దృష్టి సారించాలని వరదల్లో సహాయాన్ని అందించాలని ఆయన సూచించారు. ఇక ఏపీలో మంత్రుల తీరు చాలా దారుణంగా ఉందని అభిప్రాయపడిన కన్నా లక్ష్మీనారాయణ అటు టీడీపీ నేతల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలకు ఎవరివల్ల ఒరిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిన చంద్రబాబు కొంప మునిగిపోవడంతో ఇప్పుడు హైదరాబాద్ కు జారుకున్నారని ఎద్దేవా చేశారు కన్నా లక్ష్మీనారాయణ.
UNSC : పాకిస్తాన్కే కాదు.. అక్కడి జర్నలిస్ట్కు కూడా భారత్ స్నేహహస్తం..!! ఆసక్తికర పరిణామం..!!
ప్రస్తుతం రెండు పార్టీల తోక నేతలు 'ఇల్లు మునిగిందా? లేదా?' అని చర్చ చేస్తున్నారని లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. ఆ ఇంటి సంగతిని వదిలిపెట్టాలనీ, వైసీపీ, టీడీపీ నేతలకు కన్న హితవు పలికారు. ఇక వైసీపీ, టీడీపీ కారణంగా ఏపీ మునిగిపోతుందని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు కన్నా లక్ష్మీనారాయణ ట్వీట్ చేశారు. అధికార వైసిపి ప్రతిపక్ష టీడీపీలపై ఆయన భగ్గుమన్నారు.