మాపైనే విమర్శలా: చంద్రబాబుపై కన్నా, మేం చెప్పాం.. హోదాపై ఊమెన్
అమరావతి: ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గతంలో భావించిందని ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మంగళవారం అన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీపై అసెంబ్లీలోనూ తీర్మానం చేశారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీ సాధించిన వెంకయ్య నాయుడును టీడీపీ నేతలు సన్మానించారన్నారు.
ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ మళ్లీ రాజకీయం చేస్తున్నారని బాబుపై విమర్శలు గుప్పించారు. ఈ నాలుగేళ్ల కాలంలో టీడీపీ చేసింది అవినీతి తప్ప, అభివృద్ధి ఏమీ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతో పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తిరిగి తమపైనే విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
నాలుగేళ్లలో చంద్రబాబు చేసింది సచివాలయ నిర్మాణం మాత్రమే అన్నారు. నాలుగు ఏళ్లలో తాత్కాలిక మౌలిక సదుపాయాలు కల్పించడం తప్ప ఏం చేయలేకపోయారన్నారు.
హోదా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది: ఊమెన్ చాందీ
ఏపీకి హోదా ఇవ్వాలని విభజన సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని ఆ పార్టీ ఏపీ ఇంచార్జ్ ఊమెన్ చాందీ వేరుగా చెప్పారు. ప్రత్యేక హోదాపై నాటి హామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. హోదాకు పదేళ్లు కావాలన్న వాళ్లు అధికారంలోకి వచ్చాక మాట మార్చారని బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
యూపీఏ మళ్లీ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా పైనే ఉంటుందని చెప్పారు. హోదాకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పారు. నాలుగేళ్లు బీజేపీతో ఉన్నా టీడీపీ ప్రత్యేక హోదా సాధించలేకపోయిందన్నారు. అక్టోబర్ 2 నుంచి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమం ఉంటుందన్నారు.