కన్నా విధ్వంసకారి...వెంటనే అరెస్టుచేయాలి:టిడిపి నేతల ధ్వజం
అమరావతి:వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రాంతీయ విధ్వంసాలు సృష్టిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను అరెస్టు చేయాలని టిడిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Recommended Video
ప్రకాశం జిల్లాలో నిరసనకారుడిపై బిజెపి కార్యకర్తల దాడి ఘటన విషయమై స్పందించిన టిడిపి నేతలు ఆ పార్టీపై, కన్నాపై మండిపడ్డారు. వైఎస్ జగన్,కన్నా, పవన్ ఒకరితర్వాత ఒకరు అవేమాటలు మాట్లాడతారని మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. కన్నా అవినీతిలో కూరుకుపోయారని...కేసుల నుంచి రక్షించుకునేందుకే బీజేపీ పంచన చేరారని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఆరోపించారు.
ముగ్గురూ అవే మాటలు...నక్కా ధ్వజం
వైఎస్ జగన్ ఉదయం ఏది మాట్లాడితే...అదే అంశాన్ని కన్నా సాయంత్రం మాట్లాడతారని...తర్వాతి రోజు పవన్ అవే మాటలు వల్లిస్తారని సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో జగన్, కన్నా, పవన్ కుమ్మక్కై నాటకాలాడుతున్నారని మంత్రి ఆనందబాబు సచివాలయంలో మండిపడ్డారు.
కేంద్రంలో అధికారం...మత్తు
అనంతపురంలో మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ..."కేంద్రంలో అధికారంలో ఉన్నామన్న మత్తులో బీజేపీ నాయకులు నియంతల్లా వ్యవహరిస్తున్నారు... ప్రజలు హక్కులను అడిగితే దాడిచేసి కొట్టడం దారుణం...ఆర్ఎంపీ డాక్టర్ నల్ల దుస్తులు ధరించి రాష్ట్ర హక్కుల కోసం నిరసన వ్యక్తం చేస్తే పరుగెత్తించి కొట్టడం బాధ కలిగిస్తోంది...వైసీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం"... అని చెప్పారు.
వైసిపి,బిజెపి...రహస్య బంధం
జమిలి ఎన్నికలకు మద్దతు తెలపడం ద్వారా బీజేపీతో వైసిపికి ఉన్న రహస్య స్నేహ బంధం మరోసారి బహిర్గతమైందని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయకత్వంలో థర్డ్ఫ్రంట్ ఏర్పడి అధికారంలోకి వస్తుందనే భయంతోనే టీడీపీని దెబ్బతీయడానికి మోదీ కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. "జగన్ 200 రోజులు పాదయాత్ర చేసి మోదీని పల్లెత్తు మాట అనలేదు...తన కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు...ప్రత్యేక హోదా, కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టుపై బీజేపీపై ఒత్తిడి తేవడం లేదు"...అన్నారు.
కన్నాపై నేను...జగన్ పై నా కూతురు పోటీ
కన్నా అవినీతిలో కూరుకుపోయారని...కేసుల నుంచి రక్షించుకునేందుకే బీజేపీ పంచన చేరారని రాష్ట్ర వక్ఫ్బోర్డు చైర్మన్, ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఆరోపించారు. ‘గతంలో మంత్రిగా కన్నా అత్యంత అవినీతికి పాల్పడ్డారు. రాష్ట్రానికి కన్నం వేశారు. ఆయన అవినీతిపై విచారణ జరిపించాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. దాంతో రక్షణ కోసం కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లారు. చంద్రబాబు ఆదేశిస్తే గుంటూరులో కన్నాపై నేను, జగన్పై నా కుమార్తె పోటీకి సిద్ధం' అని సవాల్ విసిరారు. జగన్ రాష్ట్రానికి పట్టిన సైతాన్ అని విమర్శించారు.
పార్టీని అమ్మి...కేంద్ర మంత్రి
మోదీ రాష్ట్రంలో ముగ్గురు దొంగలు పవన్, జగన్, కన్నాతో కలిసి అధికారం కోసం ప్లాన్ చేస్తున్నారని జలీల్ఖాన్ విమర్శించారు. పవన్, చిరంజీవి ఇద్దరు దొంగలేనని ...చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వారి సామాజికవర్గానికి చెందినవారు కోట్ల ఆస్తులు అమ్మి ఖర్చుపెడితే...కనీసం పట్టించుకోకుండా మూటాముల్లె సర్దుకుని.. పార్టీని అమ్మేసి.. కేంద్ర మంత్రి పదవి తెచ్చుకున్నారని ఆరోపించారు. చిరంజీవి సొంత ఊళ్లో మహిళ చేతిలో ఓటమిపాలయ్యారు. పవన్కు కూడా అదే గతి పడుతుంది. పీఆర్పీకి 16 సీట్లన్నా వచ్చాయి. పవన్కు ఒక్కటీ రాదు అని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.