జోలె పట్టి రోడ్లపై భిక్షాటన చేసిన కన్నా లక్ష్మీ నారాయణ .. కారణం ఇదే
ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విరుచుకు పడుతున్నారు . గత ప్రభుత్వం టీడీపీ హయాంలో నష్టపోయిన ప్రజలకు ఇప్పుడు వైసీపీతో కూడా నష్టం జరుగుతుందని విమర్శించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్నారని ఇప్పటికే పలుమార్లు ఆరోపించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇసుక సమస్య పరిష్కారం కాలేదని, భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, వారి బతుకులు రోడ్డున పడ్డాయని ఆరోపిస్తూ, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వినూత్న నిరసనకు దిగారు. జోలె పట్టి రోడ్లమీద భిక్షాటన చేసి ప్రభుత్వ తీరుపై తమ నిరసన వ్యక్తం చేశారు కన్నా లక్ష్మీనారాయణ. ఈ ఉదయం గుంటూరు రహదారులపై ఆయన జోలెపట్టి, భిక్షాటన చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఇంత దారుణంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇసుక విధానాన్ని నిరసిస్తూ, బీజేపీ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం జరుగగా, స్థానిక పట్నం బజారులో బిక్షాటన కార్యక్రమంలో పాల్గొన్న కన్నా భవన నిర్మాణ కార్మికులను ఆదుకునేందుకు తోచిన సహాయం చేయాలని ప్రజలను కోరారు.
రోడ్లపై కనిపించిన వారిని అడుగుతూ బిక్షాటన సాగించిన కన్నా లక్ష్మీనారాయణ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకువచ్చిన కొత్త ఇసుక పాలసీ పై మండిపడ్డారు. ఎక్కడ ఇసుక అందుబాటులో లేదని, కార్మికులకు పని లేక వారి జీవితాలు రోడ్డున పడ్డాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల ఇందుకు కారణమని కన్నా మండిపడ్డారు. ప్రభుత్వ చర్యల వల్ల ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు నెలకు పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
ఏపీ లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు గా తయారైందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఏపీలో అధికార పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఇప్పటికే పలుమార్లు విరుచుకుపడ్డ కన్నా లక్ష్మీనారాయణ మరోమారు ఇసుక సమస్యలు తెరపైకి తెచ్చి భిక్షాటన చేసి వినూత్న నిరసనతో ఏపీ ప్రభుత్వ తీరును ప్రజాక్షేత్రంలో ఎండగట్టారు.