తెలుగు మీడియం తీసివేత నిర్ణయంపై జగన్ కు కన్నా లేఖ: మాతృభాషకు తీరని అన్యాయం అంటూ ఆగ్రహం
ఏపీలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా బోధన ఉండాలని భావించి వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగించాలని నిర్ణయం తీసుకుంది . ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన నిర్ణయం తప్పు కాదు కానీ తెలుగు మీడియం లేకుండా తీసెయ్యాలనే నిర్ణయం మాత్రం తప్పని ఇప్పటికే పలు విమర్శలు వస్తున్నాయి.
అంపశయ్య మీద మాతృభాష .. ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో ఆందోళన
ప్రభుత్వ బడులు అన్నింటిలోనూ తెలుగు మాధ్యమం ఎత్తివేస్తూ వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన సాగించటం ఆచరణ సాధ్యమేనా అన్న ప్రశ్నలు సైతం ఉత్పన్నం అవుతున్నాయి. తెలుగు భాషాభిమానుల నుండి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. మాతృ భాష అంపశయ్య మీద మూలుగుతున్న నేటి రోజుల్లో మొత్తానికే తెలుగు మీడియం స్కూల్స్ లేకుండా చెయ్యాలనే ప్రభుత్వ నిర్ణయం మాతృభాషకు తీరని నష్టం చేస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మీ నిర్ణయం తప్పని సీఎం జగన్ కు లేఖ రాసిన కన్నా
ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఏపీ సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని కన్నా అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అసలు తెలుగు మీడియం లేకుండా తీసేసి ఇంగ్లిష్ మీడియం విద్యాబోధన ప్రవేశపెట్టాలనే నిర్ణయం మంచిది కాదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిర్బంధ ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తే మాతృభాష తెలుగుకు తీరని అన్యాయం జరుగుతుందని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
భాషాప్రయుక్త రాష్ట్రంలో మాతృభాషలో విద్యా బోధన తీసేస్తే ఎలా ?
ఆంగ్ల భాషలో విద్యాబోధన సాగించాలనే ప్రభుత్వ నిర్ణయం దుందుడుకు చర్యగా కన్నా లక్ష్మి నారాయణ అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు తో పాటు పలు రాష్ట్రాలలో నేటికీ తెలుగు విద్యార్థుల కోసం తెలుగు మీడియం విద్యాబోధన సాగుతుంటే, భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ లో తెలుగు మీడియం తీసివేయడం దారుణమైన చర్యగా, తెలుగు జాతి మనుగడకే ముప్పు గా ఆయన పేర్కొన్నారు. ఇక ప్రాథమిక విద్యను మాతృభాషలో బోధిస్తేనే విద్యార్థుల్లో సృజనాత్మకత పెరుగుతుందని కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు.
తెలుగు మీడియం తీసివేత నిర్ణయంతో భావితరాలకు నష్టం అన్న కన్నా
కూలంకషంగా చర్చించకుండానే ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. రాష్ట్రాలన్నీ తమ మాతృభాషలను అభివృద్ధి చేసుకుంటూ ఉంటే ఏపీ ప్రభుత్వం మాత్రం భిన్నంగా వ్యవహరిస్తోందని కన్నా తన లేఖలో పేర్కొన్నారు.ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారితే విద్యార్థులకు తట్టుకునే శక్తి ఉంటుందా? అలాగే ఇంతకాలం తెలుగు మీడియం బోధించిన టీచర్లు ఒక్కసారిగా ఇంగ్లిష్ మీడియం లో విద్యా బోధన చెయ్యగలరా ? అని ఆయన ప్రశ్నించారు. భావి తరాలపై ప్రభావం చూపే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని తెలుగు భాషకు, తెలుగు జాతి మనుగడకు ప్రమాదం కలిగించే ఈ నిర్ణయం మార్చుకోవాలని లేఖ ద్వారా తెలిపారు.