నా ల్యాండ్నే కబ్జా చేశారు.. విశాఖలో భూమాఫియాపై కన్నా సంచలన వ్యాఖ్యలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఎగ్జిక్యూటివ్ కేపిటల్ను విశాఖకు తరలించాలని నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ,జనసేనలు దీనిపై వ్యతిరేక స్టాండ్తో ఉండగా.. బీజేపీ నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ విశాఖలో రాజధానిని వ్యతిరేకిస్తుండగా.. జీవీఎల్ లాంటి నేతలు మాత్రం కేంద్రం అందులో తలదూర్చదని చెబుతున్నారు. తాజాగా కన్నా లక్ష్మీనారాయణ విశాఖలో భూమాఫియాపై సంచలన ఆరోపణలు చేశారు.
విశాఖలో వైసీపీ నేతలు గన్స్ గురిపెట్టి మరీ భూకబ్జాలకు పాల్పడుతున్నారని కన్నా ఆరోపించారు. ఇటీవల తన భూమినే కబ్జా చేయబోయారని చెప్పారు. 1993లో భీమిలి సమీపంలోని చేపలుప్పాడులో తాను భూమి కొనుగోలు చేశానని చెప్పారు. ఇటీవల ఆ భూమిని కొంతమంది కబ్జా చేయడానికి యత్నించారని ఆరోపించారు.
తన పక్కనే భూమి కొనుక్కున్న ఓ పోలీస్ అధికారి తనకు ఫోన్ ద్వారా విషయం చెప్పడంతో.. తన మనుషుల్ని పంపించినట్టు చెప్పారు. వాళ్లు వెళ్లేసరికి తన భూమిలో ఫెన్సింగ్ కూడా వేసేశారని అన్నారు. ఇది కన్నా గారి ల్యాండ్ అని తన మనుషులు చెప్పడంతో.. ఆయనదని తెలియక ఫెన్సింగ్ వేసినట్టు చెప్పారన్నారు.
గతంలోనే తన ల్యాండ్కి ప్రహరీ గోడ నిర్మించుకున్నప్పటికీ.. హుద్హుద్ తుఫాను కారణంగా గోడ కూలిపోయిందన్నారు. ఇటీవల మళ్లీ గోడ నిర్మించేందుకు కాంట్రాక్టర్ కోసం వెతుకుతుండగానే.. ఇలా కబ్జాకు గురైందన్నారు. విశాఖపట్నంలో తమ పార్టీ ఆఫీసు పక్కనే ఉన్న స్థలాన్ని ముఖ్యమంత్రి బంధువులమని చెప్పి కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపించారు.
ఇటీవల విజయనగరంలో పార్వతీపురంలో ఓ పెళ్లికి వెళ్తే దాదాపు 10వేల మంది వచ్చారని చెప్పారు. వచ్చినవాళ్లంతా రాజధానిని మీరే కాపాడాలని వేడుకుంటున్నారన్నారు. విశాఖతో పాటు విజయనగరంలోనూ భూమాఫియా రెచ్చిపోతుండటం వల్లే అక్కడి ప్రజలు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని అన్నారు. భూ యజమానులు భయపడే పరిస్థితికి తీసుకొచ్చారని అన్నారు.