చంద్రబాబు పర్యావరణంపై మాట్లాడటం...దెయ్యాలు వేదాలు వల్లించడమే!:కన్నా లక్ష్మీనారాయణ
పశ్చిమగోదావరి:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఎపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు ఐక్యరాజ్యసమితిలో పర్యావరణం గురించి ప్రసంగించడం పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పర్యావరణాన్ని ఎలా నాశనం చేయాలో వారికి చెబుతావా బాబూ అంటూ ఎద్దేవా చేశారు. కొవ్వూరులో జరిగిన పశ్చిమ గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ టిడిపి ప్రభుత్వం రాష్ట్రంలో అంతులేని అవినీతికి పాల్పడుతోందని దుయ్యబట్టారు.
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో జిల్లా బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన కోడూరి లక్ష్మీనారాయణ పదవీ ప్రమాణస్వీకారోత్సవంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన కన్నా లక్ష్మీనారాయణ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లిక్కర్, ఇసుక మాఫియా ఆగడాలకు కొవ్వూరు నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పెద్ద డ్రామా కంపెనీలాగా తయారయిందని ఎద్దేవా చేశారు. ప్రకృతి సేద్యంపై ప్రసంగించేందుకు ఐక్యరాజ్యసమితి పర్యవరణ విభాగం నుంచి ఆహ్వానం అందుకున్న చంద్రబాబు అక్కడ ఏమని మాట్లాడతారని...పర్యావరణాన్ని ఎలా ధ్వంసం చేయాలో చెబుతారా?...అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో అడ్డగోలు ఇసుక, మట్టి తవ్వకాలతో పర్యావరణాన్ని కాలరాస్తున్న చంద్రబాబు పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో మాట్లాడతాననడం...దెయ్యాలు వేదాలు వల్లించడమేనని కన్నా ఎద్దేవా చేశారు. ఉచిత ఇసుక పేరుతో ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి సొమ్మును టీడీపీ నేతల జేబుల్లోకి నేరుగా తీసుకెళ్లడమే చంద్ర బాబు ఉద్దేశమని కన్నా ఆరోపించారు.