చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసిన కన్నా?
వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని కన్నా లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నట్లు ఆయన అనుచరులు తెలిపారు.
భారతీయ జనతాపార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారతారంటూ కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ ఢిల్లీ అధిష్టానం పెద్దలు మాట్లాడటంతో ప్రస్తుతానికి తన నిర్ణయాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. కానీ ఇది తాత్కాలికమేనని, కొద్దిరోజులు వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారని కన్నా అనుచరులు చెబుతున్నారు. కన్నాకు ముఖ్యమైన అనుచరులుగా ఉన్నవారు భారతీయ జనతాపార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని..
వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోను ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలనే దృఢ నిశ్చయంతో కన్నా ఉన్నారు. గతంలో ఆయన పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గాలనుంచి ప్రాతినిధ్యం వహించారు. సామాజిక సమీకరణాలు, పార్టీల బలాబలాలు, అనుచర గణం.. తదితర అంశాలన్నీ పరిగణనలోకి తీసుకున్న కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఇక్కడి నుంచి మంత్రి అంబటి రాంబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
టీడీపీ టికెట్ కోసం నలుగురు పోటీ
వచ్చే ఎన్నికల్లో అంబటి రాంబాబును వేరే నియోజకవర్గానికి పంపించి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఇక్కడి నుంచి పోటీచేయించాలనేది వైసీపీ అధిష్టానం ఆలోచనగా ఉంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఈ నియోజకవర్గ టికెట్ కోసం నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. దివంగత కోడెల శివప్రసాద్ తనయుడు, కోడెల శివరాం, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు, చలపతి విద్యాసంస్థల అధినేత చలపతి ఆంజనేయులు, తెలుగు యువత నాయకుడు అబ్బూరు మల్లి పోటీపడుతున్నారు.
అంబటిని ఓడిస్తానంటున్న పవన్
అంబటి రాంబాబును ఎట్టి పరిస్థితుల్లోను ఈసారి ఎన్నికల్లో ఓడిస్తామని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పొత్తులో భాగంగా వారు సత్తెనపల్లి నియోజకవర్గాన్ని కేటాయించామని కోరుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన తరఫున మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీ చేశారు. కౌలు రైతులకు నష్టపరిహారం ఇచ్చే సమయంలో ఈ నియోజకవర్గంలో పర్యటించిన పవన్ కల్యాణ్ అంబటి రాంబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక కార్మికుడికి పరిహారంగా వచ్చిన సొమ్ములో సగం ఇవ్వమని అడిగారంటూ ఆరోపించారు.
సత్తెనపల్లి కోసం ఎదురుచూస్తోన్న కన్నా
సత్తెనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారా? జనసేనకు కేటాయిస్తారా? అనే విషయంలో స్పష్టత కోసం కన్నా ఎదురు చూస్తున్నారని, ఆ నియోజకవర్గాన్ని ఈ రెండు పార్టీల్లో ఎవరికి వస్తే ఆ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. ఈ విషయమై ఇప్పటికే ఆయన ఇరుపార్టీల అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తో కూడా మాట్లాడి స్పష్టమైన హామీ తీసుకున్నట్లు సమాచారం. పోటీచేసే నియోజకవర్గమైతే ఖరారైందికానీ పార్టీ ఇంకా ఖరారవకపోవడం విచిత్రమే.