రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై...కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేసిన కన్నా లక్ష్మీనారాయణ
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ లో శాంతిభద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్ కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ హోంమంత్రితో సమావేశం సందర్భంగా ఈ ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం అవేమీ పట్టించుకోకుండా దోపిడీపైనే శ్రద్ధ పెట్టిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. జన్మభూమి కమిటీల నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని స్థాయిల్లోనూ అవినీతి విపరీతంగా జరుగుతోందని ఆయన ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్సింగ్తో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో...ఆగడాలు
"రాష్ట్రంలో అధికార పార్టీ ఆగడాలు మితిమీరి పోయాయి...భాజపా కార్యకర్తలపై దాడులు పెరిగాయి...ఎక్కడైనా పార్టీ వర్గాల మధ్య ఘర్షణ జరిగితే పోలీసులు అధికార పార్టీ నేతలను వదిలేసి ఇతర పార్టీల వారిపై కేసులు నమోదు చేస్తున్నారు...భాజపా నేతలపై పథకం ప్రకారం దాడులు జరుగుతున్నాయి. నేను అనంతపురం పర్యటనకు వెళ్లినప్పుడు గెస్ట్ హౌస్పై దాడికి పాల్పడ్డారు. కావలిలో చెప్పుల దాడి జరిగింది. ఒంగోలులోనూ దాడికి యత్నించగా.. భాజపా కార్యకర్తలు అడ్డుకున్నారు. కానీ పోలీసులు మాత్రం భాజపా కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారు." అని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పధకం ప్రకారమే...దాడులు
అంతకుముందు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తిరుమల పర్యటనకు వచ్చినప్పుడు పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని...ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అవినీతిని నిలదీస్తున్నందుకే దాడులు చేస్తున్నారని కన్నా చెప్పారు. ప్రభుత్వం తీరును ఎవరు ప్రశ్నించినా వేధిస్తున్నారన్నారు. "నా ఫోన్ను ట్యాపింగ్ చేస్తున్నారు... రాష్ట్ర చరిత్రలోనే ఇలాంటి అరాచక పాలన ముందెన్నడూ చూడలేదు...రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రాజ్నాథ్సింగ్కు ఫిర్యాదు చేశాను"...అని కన్నా తెలిపారు.
పురుషోత్తం రెడ్డి...బిజెపిలో చేరిక
మరోవైపు కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కలుదేవకుంట గ్రామానికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది, పీసీసీ లీగల్ సెల్ మాజీ అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి భారతీయ జనాతా పార్టీలోకి చేరనున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే ఈయనను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు హరీష్ బాబు రెండు రోజుల క్రితం మంత్రాలయంలో కలిసి పార్టీలో చేరికపై చర్చించినట్లు తెలిసింది. అంతేగాక ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల కర్నూలు, కడప జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా పురుషోత్తంరెడ్డిని పిలుపించుకొని ప్రత్యేకంగా మాట్లాడినట్లు సమాచారం. కొందరు ఢిల్లీకి చెందిన బీజేపీ అగ్రనేతలు కూడా పార్టీలో చేరాలని సూచించినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం.
పురంధేశ్వరిపై...నన్నపనేని ఆగ్రహం
ఇదిలావుంటే గోదావరిలో పడవ ప్రమాదంపై బీజేపీ నేత పురంధరేశ్వరి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ మహిళా నేత, మహిళా కమీషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వనం-మనం కోసం పిల్లలను బలితీసుకున్నారని పురంధేశ్వరి అనడం సరికాదన్నారు. పురంధేశ్వరి చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని రాజకుమారి మండిపడ్డారు. సాయం చేయాల్సింది పోయి...బురద చల్లడం సరికాదని నన్నపనేని రాజకుమారి హితవు పలికారు.