YS Viveka murder case: వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐతో ఎందుకు దర్యాప్తు చేయించరు?: జగన్ కు కన్నా లేఖ
అమరావతి: మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై విచారణను సీబీఐకి అప్పగించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. ఆయన హత్యకు గురైన ఏడు నెలల తరువాత కూడా ప్రభుత్వం హంతకులను అరెస్టు చేయలేకపోతోందని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. పోలీసులు ఉద్దేశపూరకంగానే దర్యాప్తును జాప్యం చేస్తున్నారని అన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.
సొంత ఇంట్లో.. హత్య
ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కడప జిల్లాలోని పులివెందులలో తన నివాసంలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై నాటి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. నిందితులు కడప కేంద్ర కారాగారంలో ఉంటూ విచారణను ఎదుర్కొంటున్నారు.
ఎందుకు జాప్యం..
తాజాగా- ఈ కేసులో విచారణ సవ్యంగా సాగట్లేదని కన్నా లక్ష్మీనారాయణ విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు చిన్నాన్న అయినప్పటికీ.. వివేకా హత్యోదంతంలో పోలీసులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన స్వయానా సోదరుడని గుర్తు చేస్తున్నారు. వైఎస్ వివేకాతో తనకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆయన దారుణ హత్యకు గురి కావడం కలచి వేసిందని చెప్పారు.
వైసీపీ అధికారంలో ఉన్నా..
వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వివేకా హత్యకేసులో దర్యాప్తు వేగవంతం అవుతుందని తాను ఆశించానని, అయినప్పటికీ.. వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉందని చెప్పారు. దర్యాప్తు వేగవంతం కావడానికి బదులుగా మరింత నెమ్మదించిందని ఆయన ఆరోపించారు. హత్య చోటు చేసుకున్న ఏడు నెలల తరువాత కూడా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉండటం వల్ల అనేక అనుమానాలు వ్యక్తమౌతున్నాయని చెప్పారు.
సీబీఐకి అప్పగిస్తేనే..దర్యాప్తు ముమ్మరం..
వైఎస్ వివేకా హత్యకేసును సీబీఐకి అప్పగిస్తేనే.. దర్యాప్తు సజావుగా సాగుతుందని తాను విశ్వసిస్తున్నానని, ఈ దిశగా వైఎస్ జగన్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని ఆయన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. సీబీఐ అంటే ప్రభుత్వానికి ఎందుకు భయం అనే అనుమానం కలుగుతోందని అన్నారు. ఇలాంటి అనుమానాలు సామాన్యుల్లోనూ వ్యక్తమౌతున్నాయని, వాటని పోగొట్టాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలని, సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.