స్టాచూ ఆఫ్ ఆపర్చునిటీ! తమ్ముళ్లూ బయటికి రండి: చంద్రబాబును ఏకేసిన కన్నా
అమరావతి: ఇప్పటి వరకు అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చివరకు కాంగ్రెస్ పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని ఊసరవెల్లిని మించిపోయారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.
స్టాచూ ఆఫ్ ఆపర్చునిటీకి చంద్రబాబు నిదర్శనం
మీడియా సమావేశంలో గతంలో ఎన్టీఆర్.. తనకు చంద్రబాబు ద్రోహం చేశారంటూ వ్యాఖ్యానించిన వీడియోలను ప్రదర్శించారు. అంతేగాక, చంద్రబాబు నాయుడు గతంలో కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని విమర్శించిన వీడియోలను కూడా చూపించారు. స్టాచూ ఆఫ్ యూనిటీకి సర్దార్ పటేల్ నిదర్శనమైతే.. స్టాచూ ఆఫ్ ఆపర్చునిటీ, అవినీతికి నిదర్శనం చంద్రబాబేనని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు.
ప్రజలు మోడీనే కోరుకుంటున్నారు..
ఏ సర్వే అయినా దేశంలో నరేంద్ర మోడీకి మ్యాచ్ అయ్యే నాయకుడు లేడని, ప్రజలు మరోసారి నరేంద్ర మోడీనే ప్రధాని కోరుకుంటున్నారని చెబుతున్నాయని కన్నా తెలిపారు. ప్రత్యేక హోదా కంటే కూడా ప్యాకేజీ ద్వారా ఎక్కువ నిధులు ఏపీకి కేంద్రం ఇస్తోందని తెలిపారు. మరిన్ని నిధులిస్తాం.. ఎస్పీవీ(స్పెషల్ పర్పస్ వెహికిల్) ఏర్పాటు చేయమంటే.. చంద్రబాబు సర్కారు చేయడం లేదని మండిపడ్డారు.
చంద్రబాబులో దోచేసిన సొమ్మును లాక్కుంటారనే భయం..
చంద్రబాబుకు రోజుకో మాట మాట్లాడటం అలవాటేనని కన్నా అన్నారు. ఆయన అపరిచితుడని, మానసిక వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో దోచేసిన సొమ్మును లాక్కుంటారని భయంతోనే చంద్రబాబు దేశం మొత్తం తిరుగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ కలిస్తే ఉరివేసుకుంటానని ఓ మంత్రి, ప్రజలు బట్టలూడదీసి కొడతారని మరో మంత్రి గతంలో అన్నారని.. ఇప్పుడు వారేమంటారని ప్రశ్నించారు.
తమ్ముళ్లూ టీడీపీ నుంచి బయటికి రండి..
ఆత్మగౌరవం ఉంటే వెంటనే టీడీపీ నుంచి బయటికి రావాలని మీడియా ద్వారా తమ్ముళ్లను కోరుతున్నానని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాజకీయ వ్యభిచారం చేసే వ్యక్తితో మీరుంటారా? అని ప్రశ్నించారు. బయటికి వచ్చి ఆత్మగౌరవంతో తలెత్తుకుని నిలబడండని పిలుపునిచ్చారు. పురంధేశ్వరి గతంలో కాంగ్రెస్లో ఉన్నారు కాదా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆమె పార్టీ చీఫ్ కాదని, బాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు అని గుర్తు చేశారు.
ఏపీకే ఎక్కువిచ్చాం..
చంద్రబాబు తమతో లేకున్నా.. తాము ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. మోడీ, బీజేపీని ఎవరూ వేలెత్తి చూపలేరని అన్నారు. ఏపీ అభివృద్ధిని అడ్డుకునేవారే బీజేపీని విమర్శిస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని గృహాలు, గ్రాంట్స్, రహదారులు, విద్యా సంస్థలు, నిధులు ఏపీకి ఇచ్చామని కన్నా తెలిపారు. విభజన చట్టంలో పదేళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఉందని, ఇప్పటికే చాలా హామీలు నెరవేర్చామని, మిగితావి కూడా పూర్తి చేస్తామని తెలిపారు.
అవినీతిపరులపైనే ఐటీ దాడులు.. ప్రతిష్టకు భంగమా?
నిరుద్యోగ భృతి, అన్నా క్యాంటీన్ చంద్రబాబు సర్కారు ఎప్పట్నుంచి అమలు చేస్తున్నారని కన్నా ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతిపరులపైనే ఐటీ దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఓ ఎంపీ రూ.80కోట్లు పన్ను ఎగ్గొడితే ఐటీ దాడులు జరగవా?, దీన్ని రాజకీయ కక్ష అంటారా? అని ప్రశ్నించారు. మరో ఇద్దరు ఎంపీలు జీఎస్టీ, బ్యాంకు రుణాలు కట్టలేదని ఆరోపించారు. అవినీతి పరులను పట్టుకుంటే రాష్ట్ర ప్రతిష్టకు భంగమంటారా? అని కన్నా ప్రశ్నించారు.
బీజేపీలోకి ఆహ్వానిస్తున్నాం.. హోదాపై రాహుల్ అప్పుడు స్పందించలేదే
గతంలో జాతీయరాజకీయాల్లో చక్రం తిప్పానంటారు.. అప్పుడు టీడీపీకి 2ఎంపీ సీట్లే వచ్చాయని, అధికారం కూడా కోల్పోయారని చంద్రబాబుపై మండిపడ్డారు. మోడీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలు నచ్చినవారిని ఆహ్వానిస్తున్నామని కన్నా తెలిపారు. ఏకత్వ మానవసిద్ధాంతం, అంత్యోదయ బీజేపీ సిద్ధాంతమని చెప్పారు. గెలిస్తే హోదా ఇస్తామంటున్న రాహుల్ గాంధీ.. 2014లో హోదాను చట్టంలో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి రూ.16వేల కోట్లిచ్చిందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.