‘చంద్రబాబు డైరెక్షన్లోనే కాంగ్రెస్లోకి కిరణ్! కేంద్రం సొమ్ముతో టీడీపీ అవినీతి’
అమరావతి/గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడి తీరుపై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీజేపీ కార్యకర్తల సమావేశం శుక్రవారం గుంటూరులో జరిగింది. ఈ సమావేశానికి కేంద్రమంత్రి జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మాజీ మంత్రులు కామినేని, మాణిక్యాలరావు, గోకరాజు గంగరాజు, పురందేశ్వరి, తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది కేంద్రం సహకారంతోనేనని అన్నారు. ఏపీలో కుక్కను మేక అని నమ్మించే ప్రయత్నం చంద్రబాబు, ఆయన భజన మీడియా చేస్తోందని ఎద్దేవా చేశారు.
కేంద్రం నిధులతో చంద్రబాబు అవినీతి
అంతేగాక దేశంలో ఉన్న అన్ని ఎయిమ్స్లలో ఏపీకే అత్యధిక నిధులు కేటాయించారని, ఏపీకి అన్ని రంగాల్లో సింహాభాగం నిధులు కేటాయించారని చెప్పారు. నాలుగేళ్ళుగా చంద్రబాబు కేంద్రం నిధులు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు చేసే అవినీతిని ప్రజలందరికి తెలియజేయాలన్నారు. బాబు తాను బురద పూసుకుంటూ.. దానిని బీజేపీకి పూయాలని చూస్తున్నారని కన్నా దుయ్యబట్టారు.
Recommended Video
బాబు మోసం చేయని కులం ఉందా?
‘ఏపీలో బాబు మోసం చేయని కులం అంటూ ఉందా? వెనక్కి తిరిగి చూసుకుంటే బాబుదంతా అవినీతి చరిత్ర. త్వరలో ఇంటింటికి బీజేపీలో భాగంగా బాబు అవినీతిని ప్రజలందరికి వివరించాలని' కన్నా లక్ష్మీనారాయణ సమావేశంలో పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధిపై చిత్తశుద్ధి..
కేంద్రమంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ.. నాలుగేళ్లుగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రంగాలలో సమూలమైన మార్పులు తెచ్చారని చెప్పారు. ‘దేశంలో అభివృద్ధి జరుగుతుందని ప్రతిపక్షం కూడా చెప్పక తప్పలేదు. ప్రధాని మోడీ వచ్చాక అవినీతి, లంచాలు కనుమరుగై పోయాయి. రైతులకు ఆదాయం పెంచడం కోసం వ్యవసాయంలో అనేక మార్పులు తెచ్చారు. మొదటి క్యాబినెట్లో పోలవరంకు నిధులు కేటాయించాం. ఏపీ అభివృద్ధిలో మా చిత్తశుద్దికి అదో నిదర్శనం' అని వివరించారు.
చంద్రబాబు డైరెక్షన్లో కాంగ్రెస్లోకి కిరణ్
ఇది ఇలా ఉంటే, బీజేపీ యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతు రమేష్ నాయుడు కూడా ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరడంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు డైరెక్షన్ లోనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని రమేష్ నాయుడు ఆరోపించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోలేక ఏపీ ప్రజల దృష్టిలో కిరణ్ కుమార్ రెడ్డి ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. సమైఖ్యాంధ్ర పార్టీని స్థాపించి, సొంత తమ్ముడిని కూడా గెలుపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు విష ప్రచారం మానుకోవాలి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్రానికి రావాల్సిన వాటిని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లేందుకు త్వరలోనే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. బీజేపీపై చేస్తున్న విషప్రచారాన్ని ఇప్పటికైనా చంద్రబాబు మానుకోవాలని సూచించారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీతో కలసి పని చేయాలని అన్నారు.