ఏపీ సీఎం జగన్ కు 7 లేఖలు రాసిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ .. ఏం రాశారంటే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుస లేఖలు రాశారు. జగన్ కి ఆయన 7 లేఖలు రాసిన ఆయన పలు డిమాండ్లను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు ఉంచారు. ఇక కన్నా రాసిన ఏడు లేఖల్లో ఆయన ఏయే అంశాలపై ప్రస్తావించారంటే
సీఎం జగన్ కు కన్నా లేఖల వర్షం .. రాజధాని భూములపై విచారణ జరిపించాలని లేఖ
ఆ లేఖల్లో కన్నా లక్ష్మీ నారాయణ గత ప్రభుత్వం రాజధాని భూముల అక్రమాలపై , అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని భూముల విషయంలో పోరాటమే జరిగింది. ఇక ఇప్పుడైనా ప్రస్తుత పాలక ప్రభుత్వం రాజధాని భూ కుంభకోణం గుట్టు రట్టు చెయ్యాలని, రైతులకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇక పోలవరం విషయంలో కూడా లేఖ రాసిన కన్నా అలాగే పోలవరం ప్రాజెక్టు కారణంగా నిలువ నీడ లేకుండా ఇల్లు, భూములు కోల్పోయిన ప్రజలకు న్యాయం చేయాలని కూడా కన్నా లేఖలో ముఖ్యమంత్రిని కోరారు.
చుక్కల భూముల సమస్య పరిష్కరించాలి. కూల్చిన ఆలయాలు మళ్ళీ నిర్మించాలని డిమాండ్
అలాగే రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. చుక్కల భూముల వ్యవహారం తేలక చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ఇక చుక్కల భూముల వ్యవహారం త్వరగా తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక అగ్రిగోల్డ్ వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ దేవాదాయ పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. కృష్ణా పుష్కరాలకు ముందు విజయవాడలో ఇష్టానుసారం కూలగొట్టిన ఆలయాలను తిరిగి నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇసుక అక్రమ రావాణాకు అడ్డుకట్ట వేసే కొత్త విధానం రూపొందించాలని కోరిన కన్నా
అంతే కాక గత ప్రభుత్వం తెచ్చిన ఇసుక విధానంపై ఆలోచన చేయాలని కోరారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేలా కొత్త పాలసీ తేవాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ సూచించారు. ఇలా ఏడు అంశాల మీద ఏడు లేఖలు వ్రాశారు. ఈ లేఖాలను తక్షణం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. సీఎం గారూ! ముందు వీటి సంగతి చూడండి అంటూ ఆయన సీఎం జగన్ కు లేఖలతో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరారు.