బాబు యూటర్న్పై మోడీ అడిగారు, అలా జరిగితే టీడీపీ నామరూపాల్లేకుండా..: కన్నా ఏకేశారు
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ తనతో చెప్పారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలతో భేటీ అయిన అనంతరం బీజేపీ నేతలు పురంధేశ్వరి, జీవీఎల్ నర్సింహారావుతో కలిసి కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు.
విభజన హామీల అమలు కోసం కేంద్రం కృషి చేస్తోందని కన్నా చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఏపీకి ఇవ్వాల్సిన వాటిపై పరిశీలిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
బాబు యూటర్న్పై మోడీ అడిగారు
దేశంలో ఏ రాష్ట్రానికి చేయనంత సాయం ఏపీకి కేంద్రం చేసిందని అన్నారు. 30జిల్లాలున్న కర్ణాటకకు రూ.76వేల కోట్ల గ్రాంట్స్ ఇస్తే.. 13జిల్లాలున్న ఏపీకి రూ. లక్షా26వేల కోట్లు కేంద్ర ఇచ్చిందని చెప్పారు. ప్యాకేజీకి అంగీకరించిన చంద్రబాబు నాయుడు హోదా అంటూ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని తనను ప్రధాన మోడీ అడిగారని కన్నా తెలిపారు. చంద్రబాబుకు అందరికన్నా ప్రాధాన్యత ఇచ్చామని మోడీ చెప్పారని తెలిపారు.
మోడీ కట్టుబడి ఉన్నారు
కేంద్రం ఇచ్చిన నిధులు తీసుకుంటూనే.. కేంద్రం ఏమీ ఇవ్వడం లేదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సెంట్రల్ యూనివర్సిటీ, ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇస్తూనే ఉందని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని తిరుపతి సభలో ఇచ్చిన మాటకు ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని కన్నా చెప్పారు. రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ ఇతర ఏ విషయంలోనూ కేంద్రం వెనక్కి వెళ్లలేదని తెలిపారు. కేంద్రం ఇచ్చిన అన్ని హామీలను నిలబెట్టుకుంటున్నా.. ఏమీ చేయలేదని అనడం సరికాదన్నారు.
వెన్నుపోటు బాబుకు అలవాటే కదా
కేంద్రం, బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలపై కన్నా మండిపడ్డారు. చంద్రబాబుకు నమ్మిన వాళ్లను మోసం చేయడం అలవాటేనని, వెన్నుపోటు పొడవడం ఆయన నైజమని కన్నా దుయ్యబట్టారు. హోదాను భూతంలా చూపించి ప్రజల్లో కేంద్రంపై వ్యతిరేకత తీసుకొచ్చే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హోదా ఇస్తే రూ.వెయ్యి కోట్లు కూడా తీసుకోలేమని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వమే చెప్పిందని అన్నారు. ప్యాకేజీ పేరుతో అదనంగా నిధులస్తామంటే ఒప్పుకున్న చంద్రబాబు.. మోడీపై ప్రశంసలు కురిపించారని, వెంకయ్యనాయుడుకు సన్మానాలు చేశారని అన్నారు. ఇప్పుడు హోదా అంటూ అబద్ధాలు చెబుతూ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అవినీతి, స్వార్థరాజకీయాలు పక్కపెడితే..
హోదా విభజన చట్టంలో లేదని, అందుకే ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రూ.16,500 కోట్ల నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. అవినీతి, స్వార్థ రాజకీయాలు పక్కన పెట్టి.. ఎస్పీవీలు ఫాం చేసి రావాలని చంద్రబాబు సర్కారుకు హితవు పలికారు. చంద్రబాబు తమ అవినీతిని, చేతకానితనాన్ని కప్పుపుచ్చుకునేందుకు తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లోకి టీడీపీ అవినీతిని తీసుకెళ్తామని.. తాము బాబులా అబద్ధాలు చెప్పమని అన్నారు. దీన్ని ఏపీ ప్రజలు గమనించాలన్నారు.
అలా జరిగితే టీడీపీ నామరూపాల్లేకుండా పోతుంది
ఏపీలో స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదని రాష్ట్ర అధికారులే చెప్పారని అన్నారు. మెకాన్ అనే సంస్థతో సాధ్యత కోసం నివేదిక తయారు చేయమంటే ఆ సంస్థతో కూర్చుని రిపోర్టును ఇచ్చేందుకు కూడా చంద్రబాబు సర్కారు ప్రయత్నించలేదని మండిపడ్డారు. స్వార్థ రాజకీయాలతో ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చంద్రబాబుపై కన్నా మండిపడ్డారు. చంద్రబాబు అబద్ధాలు చెబుతూ కేంద్రాన్ని, బీజేపీని దోషి చూపించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, టీడీపీ అబద్ధాలను ప్రజలు పసిగట్టిన నాడు ఏపీలో టీడీపీ మట్టికొట్టుకుపోతుందని, నామారూపాల్లేకుండా పోతుందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.