సంచలనం:ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ...ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా సోమూ వీర్రాజు
న్యూఢిల్లీ:ఎట్టకేలకు ఏపీ బీజేపీ అధ్యక్షుడి నియామకం జరిగింది. సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్ణయిస్తూ భారతీయ జనతా పార్టీ ఆదేశాలు జారీ చేసింది. బిజెపి తమ పార్టీ సంప్రదాయానికి భిన్నంగా కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఏకాఏకీన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది.
మరోవైపు ఈయనే ఎపీ బిజెపి అధ్యక్షుడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన తమ పార్టీ మరో నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఏపీ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా అధిష్టానం నియమించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఎపి బిజెపి అధ్యక్షుడు ఎవరనే ఉత్కంఠకు నేటితో తెరపడింది.
ఎపి బిజెపి అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ, అలాగే అధ్యక్షుడి పీఠం అధిరోహిస్తారనుకున్న సోమూ వీర్రాజును ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా నియమిస్తూ ...బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రెండే వాక్యాల్లో వీరిద్దరి నియామకాలను ఖరారు చేయడం విశేషం.
సీనియర్ రాజకీయ నేత, మంచి వ్యూహకర్త, బలమైన కాపు సామాజిక వర్గం నాయకుడు అయిన కన్నా లక్ష్మీ నారాయణ రాష్ట్రంలో ఇబ్బందుల్లో ఉన్న భారతీయ జనతా పార్టీని ఒక గాడిలో పెడతారని బిజెపి అధిష్టానం తమ పార్టీ సిద్దాంతాలను పక్కన పెట్టి మరీ కన్నా ను ఈ పదవికి ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కన్నా దూకుడుగా ఉంటూనే లక్ష్యాన్ని అందుకునే దిశలో పార్టీని నడిపించగలరని, ఈ విషయంలో సోమూ వీర్రాజు కంటే కన్నానే అధ్యక్షుడిగా నియమించడం ఉత్తమమని భావించి బిజెపి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.