జగన్ పేరు చెప్పి మాపై కేసులా: బాబుపై కన్నా, 'తుని విధ్వంసం వీడియోలు పంపండి'
విజయవాడ: ఓ వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి చినరాజప్పలు తునిలో జరిగిన విధ్వంసానికి కాపులు కారణనం కాదంటూనే రాష్ట్రవ్యాప్తంగా కాపు నాయకుల పైన కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ బుధవారం మండిపడ్డారు.
కేసులకు తాము భయపడే ప్రసక్తి లేదన్నారు. అవసరమైతే జైలుకెళ్తామని, బెయిల్ మాత్రం కోరమని చెప్పారు. ముఖ్యమంత్రి తుని ఘటన అనంతంర వైసిపి నేత జగన్ ఈ దుర్ఘటనకు కారణమని చెప్పారని, ఇప్పుడేమో సభకు వెళ్లిన కాపు నాయకులందర్నీ నిందితులుగా చేరుస్తున్నారన్నారు.
గ్రామగ్రామాన ఉద్యమానికి తరలి వెళ్లిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఉద్యమానికి మూల కారణం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీయే అన్నారు. ఆరు నెలల్లో కాపు రిజర్వేషన్ అమలు, కార్పోరేషన్కు ప్రతి ఏటా రూ.వెయ్యి కోట్లు ఇస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు.
దీనిని గుర్తు చేసేందుకే కాపు నేత ముద్రగడ పద్మనాభం సభను నిర్వహించారని చెప్పారు. వేదిక పైన ఎవరికి మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముద్రగడ ఒక్కరే మాట్లాడి, రైల్, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారన్నారు. తాను ప్రసంగం చేయలేదని, ముద్రగడ ప్రసంగం అనంతరం ఇంటికి వచ్చానని చెప్పారు. కాపులు మంచివాళ్లని చంద్రబాబు చెప్పారని, మరిప్పుడు కేసులు ఎలా పెడుతున్నారో చెప్పాలన్నారు.
దీక్షపై పునరాలోచన చేయండి: త్రిమూర్తులు
కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని, దీనిపై ముద్రగడ పునరాలోచన చేయాలని టిడిపి నేత తోట త్రిమూర్తులు అన్నారు. అమాయకుల పైన కేసులు పెడితే ఊరుకోమని చెప్పారు. దోషులపై కేసులు పెట్టడం సరైనదే అన్నారు.
ఇంత దుర్మార్గానికి కుట్ర చేసిన వారిని శిక్షించాలనేది తన అభిప్రాయం అన్నారు. సమావేశం పెట్టుకునేది తమ ఆందోళన ప్రభుత్వానికి తెలియజేసేందుకని, విధ్వంసం సృష్టించేందుకు కాదన్నారు. కాపుల అంశంపై ప్రభుత్వంతో, ఉద్యమ నేతలతో మాట్లాడేందుకు తాను సిద్ధమని చెప్పారు.
చేతులు జోడిస్తున్నా: బొండా ఉమ
కాపులను బీసీల్లో చేర్చాలని ఈ నెల 5న దీక్ష చేపట్టబోతున్న ముద్రగడ తన దీక్ష ఆలోచన విరమించాలని చేతులు జోడించి కోరుతున్నానని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు అన్నారు. జీవో 30 ఇవ్వడానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పారు. న్యాయబద్దంగా రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేతలు కోరుతున్నారన్నారు. ఇదిలా ఉండగా, తుని ఘటనకు సంబంధించి వీడియోలు, ఫోటోలు, తమ వద్ద ఉన్న ఆధారాలు పంపించాలని పోలీసులు వాట్సాప్, ఈమెయిల్లను విడుదల చేశారు.
'కాపు' కోసం ఉపసంఘం
కాపుల పైన నిర్ణయం కోసం కాపు సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. కాపు సమస్యపై సుదీర్ఘంగా కేబినెట్లో చర్చించారు. గంటా శ్రీనివాస్ రావు, చినరాజప్ప, నారాయణ, కొల్లు రవీంద్ర తదితరులతో ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
అలాగే, కాపులను బిసిల్లో చేర్చేందుకు అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసిన మంజనాథ కమిటీ కాల పరిమితి తగ్గింపు సాధ్యం కాదని కేబినట్ భావించింది. ఆరు నెలలు లేదా మూడు నెలలకు తగ్గించాలని చర్చకు వచ్చింది.
అయితే, అది వీలు కాదని తేల్చింది. కాపు కార్పోరేషన్కు రూ.1000 కోట్లు ఇవ్వాలని, సరైన సమయం ఇస్తే కమిషన్ అన్ని అంశాలపై నివేదిక ఇస్తుందని కేబినెట్ భావించింది. తుని ఘటన కుట్రపూరితంగా జరిగిందని కేబినెట్ భావించింది. అలాగే పోలీసులు మరింత నిఘా పెడితే బాగుండేదని భావించింది.