ముద్రగడతో కన్నా లక్ష్మీనారాయణ ఏకాంత చర్చలు, బాబుపై 'కాపు' ఆగ్రహం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ బీజేపీ కొత్త అధ్యక్షులుగా కన్నా లక్ష్మీనారాయణను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ విషయం తెలియడంతో అభిమానులు, ఇతర నేతలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన ఇల్లు అతిథుల తాకిడితో నిండిపోయింది. కన్నా నివాసం సందడిగా కనిపించింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం కన్నా లక్ష్మీనారాయణతో భేటీ అయ్యారు. వారిద్దరు ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. ఏపీ బీజేపీ చీఫ్గా నియమించబడినందుకు కన్నాకు అభినందనలు తెలియజేశానని చెప్పారు. కాపు రిజర్వేషన్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు.
సంచలనం:ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ...ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్గా సోము వీర్రాజు
కాపులకు ఏదో చేశామని చెప్పేందుకే నివేదిక పంపించారు
కాపులకు ఏదో చేశామన్న అభిప్రాయం కల్పించేందుకే చంద్రబాబు కేంద్రానికి కాపు రిజర్వేషన్లపై నివేదిక పంపించారని ముద్రగడ ఆరోపించారు. వాస్తవాల ఆధారంగా కేంద్రానికి నివేదిక ఇచ్చి ఉంటే కాపు రిజర్వేషన్లు వచ్చి ఉండేవని చెప్పారు. కాపు రిజర్వేషన్లకు సహకరించాలని కేంద్రాన్ని కూడా కోరుతామని చెప్పారు.
వైసీపీలోకి వెళ్తారని ప్రచారం
కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల వైసీపీలోకి వెళ్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఇందుకోసం చర్చలు కూడా జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఆయన బీజేపీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దానిని మరొకరికి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించిందని తెలిసి వైసీపీలో చేరుతామని భావించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం మాత్రం పలు సామాజిక సమీకరణాల నేపథ్యంలో కన్నాకే అధ్యక్ష పదవి అప్పగించింది.
బీజేపీపై దుష్ప్రచారం తిప్పికొడతాం
తన పేరును అధిష్టానం ప్రకటించిన విషయం తెలియగానే కన్నా మాట్లాడుతూ.. అధిష్టానం నమ్మకాన్ని వమ్ము చేయనని చెప్పారు. బీజేపీపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడతామన్నారు. పార్టీ ఉన్నతికి కృషి చేస్తానని చెప్పారు. ఇచ్చిన హామీలకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు.
ఢిల్లీకి కన్నా లక్ష్మీనారాయణ
కాగా, కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి చాలాకాలంగా పెండింగులో ఉంది. సామాజిక అంశాలు తదితర వాటి కారణంగా ఇన్నాళ్లు నిర్ణయం తీసుకోలేకపోయారు. ఎట్టకేలకు ఇప్పుడు నిర్ణయం వచ్చింది.