తిరుమల వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా డిమాండ్
న్యూఢిల్లీ:తిరుమల వ్యవహారాలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. టీటీడీపై వస్తున్న ఆరోపణల విషయంలో స్వతంత్ర విచారణ చేయిస్తే తప్పేంటని ఆయన ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం జవాబు చెప్పి, భక్తుల అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీవారి ఆభరణాల విషయంలో ఆరోపణలు చేస్తున్న రమణ దీక్షితులు ఇటీవలి వరకూ అక్కడ ప్రధాన అర్చకుడు అనే విషయం గుర్తించాలన్నారు. అలాగే శ్రీవారి ఆభరణాల మాయంపై విచారణ చేయించి టీడీపీ ప్రభుత్వం తన నిజాయితీ నిరూపించుకోవాలన్నారు. టీటీడీ వ్యవహారంపై ప్రశ్నించినవారిపై టిడిపి ప్రభుత్వం కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నెల 26 తేదీతో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకుంటుందని, ఆ సందర్భంగా గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కన్నా తెలిపారు. అదే రోజున ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తానని కన్నా వెల్లడించారు. అలాగే రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయమని అమిత్ షా తనను ఆదేశించినట్లు కన్నా తెలిపారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు వ్యూహాన్ని రూపొందించి ప్రభావవంతంగా పనిచేయాలని అమిత్ షా సూచించారని చెప్పారు. బీజేపీపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే తమ ప్రధాన బాధ్యత అని కన్నా చెప్పారు.