బీజేపీకి షాక్, ఇంత అవమానమా?: వైసీపీలోకి కన్నా-కాటసాని, జగన్కు కన్నా 2 షరతులు
అమరావతి: ఇప్పటికే ప్రత్యేక హోదా అంశంలో ఇరుకునపడ్డ బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో మరో షాక్. ఇద్దరు కీలక నేతలు త్వరలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ బుధవారం వైసీపీలో చేరనున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన బీజేపీ అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారు.
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా వీర్రాజు, వైసీపీలోకి కన్నా, కారణాలివే.. టచ్లో కీలక నేతలు?
కంభంపాటి హరిబాబు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం దానిపై కన్నా ఆశలు పెట్టుకున్నారు. కానీ సోము వీర్రాజు పేరు ఖరారు అయింది. ఈ నేపథ్యంలో అసంతృప్తితో పాటు ఏపీలో బీజేపీ పరిస్థితి ఆశాజనకంగా లేదని భావించి ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జగన్ సమక్షంలో ఎల్లుండి ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంరెడ్డి కూడా బీజేపీని వీడి ఈ నెల 29న వైసీపీలో చేరనున్నారు. మరో నేత వసంత్ కృష్ణప్రసాద్ ఈ నెల 27న వైసీపీలో చేరుతారు.
ఇంత అవమానం జరిగాక బీజేపీలో ఉంటారా, వైసీపీలో చేరండి
కన్నా లక్ష్మీనారాయణ ఆదివారం తన అనుచరులతో భేటీ అయ్యారు. తక్షణమే బీజేపీని వీడి బయటకు రావాలని అభిమానులు, అనుయాయులు కోరారు. ఆ పార్టీలో చేరిన నాటి నుంచి ఇప్పటిదాకా మీకు సరైన గుర్తింపు ఇవ్వలేదని, కొన్నిసార్లు పార్టీ సమావేశాల్లో వేదిక పైకి కూడా ఆహ్వానించకుండా కిందే కార్యకర్తల నడుమ కూర్చోబెట్టారని, మీలాంటి సీనియర్కు ఆ పార్టీలో అంత అవమానం జరిగితే ఇంకెందుకు ఉండటంమని, వెంటనే వైసీపీలో చేరాలని అభిమానులు, కార్యకర్తలు కన్నాకు సూచించారు.
వైసీపీలో చేరాలని నిర్ణయం
గుంటూరులోని కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు గతంలో కలిసి పనిచేసిన రెండు నియోజకవర్గాలు పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నాయకులు, అభిమానులు కలిశారు. వైసీపీలో చేరాలని ఎక్కువ మంది ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.
పలు కారణాలతో కన్నాకు దక్కని అవకాశం
కన్నా లక్ష్మీనారాయణ వైయస్ రాజశేఖర రెడ్డి, కొణిజేటి రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల కేబినెట్లో మంత్రిగా బని చేశారు. 1989-1994 మధ్య కూడా మంత్రిగా ఉన్నారు. హోదా, ప్యాకేజీ తదితర అంశాలపై మోడీ ప్రభుత్వాన్ని సమర్థించారు. చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పేరు రాష్ట్ర అధ్యక్షుడిగా పరిశీలనలోకి వచ్చింది. అయితే, కాంగ్రెస్ నుంచి రావడంతో పాటు, ఇతర అన్ని అంశాలను పరిశీలించి సోము వీర్రాజును ఎంపిక చేశారని తెలుస్తోంది. దీంతో కన్నా అసంతృప్తికి లోనయ్యారు.
జగన్కు కన్నా రెండు షరతులు
వైసీపీలో చేరనున్న కన్నా లక్ష్మీనారాయణకు జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. తనకు గుంటూరు లోకసభ స్థానం, తన కొడుకు పణికి గుంటూరు పశ్చిమ టిక్కెట్ ఇవ్వాలని కోరారని తెలుస్తోంది. ఒకవేళ తనకు నరసారావుపేట లోకసభ స్థానం ఇస్తే పెదకూరపాడు ఎమ్మెల్యే టిక్కెట్ తన కొడుక్కి ఇవ్వాలని షరతు విధించారని తెలుస్తోంది. అయితే దీనికి జగన్ అంగీకరించి ఉంటారని అంటున్నారు.