చంపేకుట్ర: హోంశాఖకు ఫిర్యాదు యోచనలో కన్నా, మోడీని వదిలేస్తామా: పురంధేశ్వరి
అనంతపురం/అమరావతి: తనపై అనంతపురంలో దాడి జరిగిన ఘటనను బీజేపీ ఏపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆ పార్టీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై హోంశాఖకు ఫిర్యాదు చేసే యోచనలో కన్నా ఉన్నారు. దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసినా, మళ్లీ పునరావృతం కావడంపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
కాంగ్రెస్లోకి రంగం సిద్ధం.. ఇదీ మీ పదవి!: కిరణ్ రెడ్డికి రాహుల్గాంధీ సందేశం, టీఎస్సార్ భేటీ
తనపై దాడి విషయమై కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. టీడీపీపై ఆరోపణలు చేసినందుకు తమపై దాడులు చేయడం సరికాదన్నారు. అవినీతి, అక్రమాలు అబద్దాలు అయితే ఆధారాలతో నిరూపించాలని సవాల్ చేశారు. దాడులతో బెదిరించడం కాదన్నారు. తాము బెదిరేది లేదన్నారు.
నన్ను చంపేందుకు కుట్ర
ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన సాగుతోందని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. తనను చంపేందుకు ప్రయత్నించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల అండతోనే తెలుగుదేసం పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. అసలు రాయలసీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం చేశారో చెప్పాలన్నారు.
నాడు అమిత్ షాపై, నేడు నాపై హత్యాయత్నం
రాష్ట్రంలో 50,914 గృహాలను కేంద్రం మంజూరు చేస్తే ఇప్పటి వరకు ఎన్ని నిర్మించారో చెప్పాలని కన్నా లక్ష్మీనారాయణ టీడీపీని నిలదీశారు. అసలు రాయలసీమకు ఏ ప్రాజెక్టు తెచ్చారో చెప్పాలన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సమగ్ర అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో తిరుపతి వచ్చినప్పుడు అమిత్ షాపై హత్యకు కుట్ర చేశారని, ఇప్పుడు తనపై హత్యాయత్నం జరిగిందన్నారు.
దాడిపై బీజేపీ సీరియస్
కాగా, కన్నా లక్ష్మీనారాయణపై దాడి ప్రయత్నాన్ని బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. తిరుమలలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పైన, ఇప్పుడు కన్నా పైన దాడి యత్నాన్ని కమలం పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. పోలీసులు ఉన్నా పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ కుట్రపూరితంగా దాడులు చేస్తోందని వారు అంటున్నారు.
మోడీ అన్యాయం చేస్తే మేం ఎలా ఊరుకుంటాం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో కేంద్రం వివక్ష చూపదని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం అన్నారు. పోలవరం ప్రాజెక్టు, కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో కేంద్రం సానుకూలంగానే ఉందని చెప్పారు. వీటిపై టీడీపీ నేతల అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఏపీ ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం, నరేంద్రమోడీ అన్యాయం చేస్తే మేం ఎలా ఊరుకుంటామని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు.