చంద్రబాబు వీధిరౌడీలా: కన్నా, కడప స్టీల్ప్లాంట్పై మంత్రులు సుజయ, అమర్నాథ్ రెడ్డి
అమరావతి: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ ప్రభుత్వంపై బుధవారం నిప్పులు చెరిగారు. బాబు వస్తే జాబు వస్తుందని తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల సమయంలో చెప్పిందని, కానీ ఒక్క నారా లోకేష్కు మాత్రమే ఉద్యోగం వచ్చిందన్నారు. అన్నం పెట్టే చేతిని నరికే గుణం చంద్రబాబుది అన్నారు. కడప స్టీల్ ప్లాంటును సాధించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రం సహకరించడం లేదన్నారు.
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో తమపై అనవసర ఆరోపణలు సరికాదన్నారు. ఏపీలో పేదలకు అందాల్సిన ప్రతి రూపాయి దోపిడీకి గురవుతోందని మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులను వీధిరౌడీలా చంద్రబాబు నాయుడు బెదిరించారన్నారు. వంశధార, తోటపల్లి ప్రాజెక్టులను పూర్తి చేశారా అని ప్రశ్నించారు. జిల్లా వారిగా మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తామని చెప్పారు.
కడప స్టీల్ ప్లాంట్పై ఏపీ మంత్రులు
విభజన హామీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబు ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లారని మంత్రి సుజయ కృష్ణ రంగారావు చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం కావాల్సిన ఏర్పాట్లను చేస్తామని తాము కేంద్రంతో చెప్పామన్నారు. మెకాన్ సంస్థ పరిశీలించాక కూడా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో తాత్సారం చేస్తున్నారన్నారు. మెకాన్ సంస్థ ఇచ్చిన కొత్త రిపోర్టును కాకుండా, కోర్టుకు పాత రిపోర్టు ఇచ్చారన్నారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో రాష్ట్రం సహకరించలేదనడం సరికాదన్నారు.
ఏపీకి స్టీల్ ప్లాంట్ రాకూడదనే కేంద్రం కుట్ర చేస్తోందని మరో మంత్రి అమర్నాథ్ రెడ్డి అన్నారు. ఉక్కు పరిశ్రమను తెస్తామని బీజేపీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ తీసుకు రాకుండా రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించే అర్హత బీజేపీకి లేదన్నారు. అన్ని రకాల ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పామని తెలిపారు. కడప స్టీల్ ప్లాంటు విషయంలో కేంద్రం అనేక కుంటి సాకులు చెబుతోందన్నారు. ఫీజుబులిటీ లేకుండా ప్రయివేటు సంస్థలు ఎలా ముందుకు వస్తాయన్నారు.