'నాలుగేళ్లలో ఇదీ చంద్రబాబు పరిస్థితి, ఎంత చెప్పినా 16 సీట్లలో గెలుపు, అసలు టీడీపీకి ఉలుకెందుకు?
అమరావతి: తెలుగుదేశం పార్టీపై ఏపీ బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీది మహానాడు కాదని, మాయానాడు అని ధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ఏపీలో తాము ఏం చేశామో చెప్పుకునే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉన్నది ఎన్టీఆర్ స్థాపించిన నిజమైన తెలుగుదేశం పార్టీ కాదన్నారు.
అవసరమైతే జగన్తో ఆలింగనం, బాబు ఎలాంటివాడంటే: ఓటుకు నోటును లాగిన పవన్ కళ్యాణ్
ఎన్టీఆర్ పైన చెప్పులేయించి చావుకు కారణం
ఎన్టీఆర్ పైన చెప్పులేయించి ఆయన చావుకు కారణమైన వారు ఇప్పుడు ఆ పార్టీని దక్కించుకున్నారన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అద్దెమైకుగా తయారయ్యారన్నారు. ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే ఎన్టీఆర్ వ్యతిరేకంగా పార్టీని స్థాపించారో అదే పార్టీతో చంద్రబాబు దగ్గరవుతున్నారని విమర్శించారు. కర్ణాటకలో బీజేపీకి ఓటు వేయవద్దని టీడీపీ అధినేత పిలుపునిచ్చినా ప్రజలు లెక్కలోకి తీసుకోలేదన్నారు.
చంద్రబాబు పిలుపునిచ్చినా 16 స్థానాల్లో బీజేపీ గెలుపు
కర్ణాటకలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఏకంగా 16 స్థానాల్లో గెలిచిందని కన్నా చెప్పారు. బీజేపీతో కలిసి ఉన్నన్నాళ్లు ప్రత్యేక హోదాతో లాభం లేదని, హోదా కంటే ఎక్కువ నిధులు కేంద్రం ఇస్తుందని చంద్రబాబు చెప్పారని కన్నా గుర్తు చేశారు. ప్రత్యేక హోదా కంటే ఎక్కువే సాధించామని మిఠాయిలు కూడా పంచారని చెప్పారు. హోదా వల్ల లాభం లేదని ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
వెంకయ్యను ఊరూరా తిప్పి సన్మానించారుగా
ప్రత్యేక హోదా బదులు మంచి ప్యాకేజీ ఇచ్చారని వెంకయ్య నాయుడిని ఊరూరా తిప్పి సన్మానం చేయించారని కన్నా గుర్తు చేశారు. ఇప్పుడు మాత్రం యూటర్న్ తీసుకున్నారన్నారు. చూస్తుంటే చంద్రబాబు మానసికస్థితి బాగా లేదని అర్థమవుతోందన్నారు. ఆయనను చూపించడం మంచిదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అసమర్థత వల్ల ఏపీకి తీవ్ర అన్యాయం జరిగిందని కన్నా వ్యాఖ్యానించారు.
టీటీడీలో అన్యాయం అంటే మీకు ఉలుకెందుకు?
తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యాయం జరుగుతుందని చెబుతుంటే టీడీపీకి ఉలుకు ఎందుకో చెప్పాలని కన్నా ప్రశ్నించారు. టీటీడీ విషయంలో తెలుగుదేశం పార్టీ భయపడుతుంటే తమకు అనుమానం వస్తోందన్నారు. టీటీడీలో ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అప్పుడే అన్ని విషయాలు తేలుతాయన్నారు.