జగన్ కారణమని, మాపై కేసులు పెడ్తారా: తుని ఘటనలపై చంద్రబాబు మీద కన్నా ఫైర్
గుంటూరు: ఓ వైపు రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి చినరాజప్పలు తునిలో జరిగిన విధ్వంసానికి కాపులు కారణం కాదంటూనే రాష్ట్ర వ్యాప్తంగా కాపు నాయకులపై కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి, బిజెపి నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
గుంటూరులో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసులకు తాను భయపడనని చెప్పారు. అవసరమైతే జైలుకైనా వెళతామని, బెయిల్ మాత్రం కోరబోమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తుని ఘటన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత జగనే ఈ దుర్ఘటనకు కారణమని స్పష్టం చేశారని, ఇప్పుడేమో సభకు వెళ్లిన కాపు నాయకులందరిని నిందితులుగా చేరుస్తున్నారన్నారని కన్నా మండిపడ్డారు.
గ్రామ గ్రామాన ఉద్యమానికి తరలివెళ్లిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారన్నారు. ఉద్యమానికి మూల కారణం ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన హామీయే కారణమని తెలిపారు. ఆరు నెలల్లో కాపు రిజర్వేషన్ అమలు, కార్పొరేషన్కు ప్రతి ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తామన్న హామీ నెరవేర్చలేదన్నారు.
దీన్ని గుర్తు చేసేందుకే కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం సభ నిర్వహించారన్నారు. వేదికపైన ఎవరికి మాట్లాడే అవకాశం రాలేదన్నారు. ముద్రగడ ఒక్కరే మాట్లాడి రైల్, రాస్తారోకోలకు పిలుపునిచ్చారన్నారు. తాను ప్రసంగం చేయలేదని, ముద్రగడ ప్రసంగం అనంతరం తాను ఇంటికి వచ్చేశానన్నారు.