కోర్టును అగౌరపర్చారు, అందుకే బాబుకు అరెస్ట్ వారెంటు: కన్నా, ‘ఏపీలోనే పెట్రోల్ అత్యధిక పన్నులు’
అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు వేర్వేరుగా మాట్లాడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్రోల్, డీజిల్ టీడీపీ సర్కారు కేవలం రూ.2 తగ్గించడంపై సోము వీర్రాజు మండిపడ్డారు.
అరెస్ట్ వారెంట్: నరకం చూశాం, చంద్రబాబు కన్నీరు: మోడీ, కేసీఆర్ కుట్రేనంటూ టీటీడీపీ ఫైర్
అత్యధిక పన్నులు ఏపీలోనే.. రూ.6తగ్గించండి..
దేశంలో ఏ రాష్ట్రం వేయనన్ని పన్నులు విధిస్తూ.. రూ. 2మాత్రమే తగ్గిస్తారా? అని నిలదీశారు. కనీం రూ. 6 తగ్గించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని కేంద్రాన్ని కోరతామని చెప్పారు. కాకినాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీపై చంద్రబాబు చేస్తున్న విమర్శలు చేస్తుంటే రాష్ట్రాన్ని నడిపించడం చేతకాదని స్పష్టమవుతోందని అన్నారు. కేంద్రంపై చేస్తున్న విమర్శలు చంద్రబాబు చేతకాని తననాకి నిదర్శనమని అన్నారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందన్నారు.
ప్రధాని, కేంద్రమంత్రుల ఫొటోలేవీ?
మోడీ పరిపాలనలో దేశం అభివృద్ధి దిశగా సాగుతోందని సోము వీర్రాజు అన్నారు. పోలవరంకు కేంద్రమే నిధులు మంజూరు చేస్తున్నా.. ఈ ప్రాజెక్టుపై చేసే ప్రభుత్వ ప్రకటనల్లో ప్రధాని మోడీ, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఫొటోలు ముద్రించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అల్లూరి సీతారామారాజు పేరు పెట్టాలని అన్నారు. అలాగే రాజమహేంద్రవరం విమానాశ్రయానికి టంగుటూరి ప్రకాశం పంతులు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు కోర్టుకు వెళ్లకపోవడంతోనే అరెస్ట్ వారెంట్
ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై అరెస్ట్ వారంట్ జారీ కావడంపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసులు రావడం వెనక ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారనేది అవాస్తవమని చెప్పారు. 2013 నుంచి కేసు నడుస్తోంది.. అప్పటి నుంచి వారికి నోటీసులు వస్తున్నాయని పేర్కొన్నారు. చంద్రబాబు 2016 వరకు అప్పుడప్పుడు కోర్టుకు వెళ్తూ వచ్చారు.. చివరి 22 వాయిదాలకు వెళ్లకపోవడం వల్ల నాన్బెయిలబుల్ అరెస్ట్ వారంట్ జారీ చేశారని వెల్లడించారు.
మోడీ ఉన్నారంటూ టీడీపీ డ్రామాలు
కేవలం ముద్దాయిలు 22 సార్లు కోర్టుకు వెళ్లకపోవడం వల్లనే వారెంట్ వచ్చిందని తెలిపారు. సాధారణంగా 3 సార్లు ముద్దాయిలు కోర్టుకు వెళ్లకపోతే నాన్బెయిలబుల్ వారెంట్ వస్తుందని వివరించారు. ఇప్పుడు కొత్తగా నోటీసుల వెనక మోడీ ఉన్నారని కొత్త డ్రామాలు ఆడుతున్నారని కన్నా విమర్శించారు. చంద్రబాబు మీద కేసు కాంగ్రెస్ హయాంలో పెట్టిందని గుర్తు చేశారు. వాయిదాలకు వెళ్లకుండా చంద్రబాబు కోర్టులను అగౌరవపరిచేలా వ్యవహరించారని కన్నా మండిపడ్డారు.