కాపులంతా ఏకమై...రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది: ముద్రగడ
విశాఖపట్నం:కాపులంతా ఏకమై రాజ్యాధికారం కోసం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని కాపుసంఘం నేత ముద్రగడ పద్మనాభం పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖపట్టణంలో జరిగిన కాపునాడు సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ...తుని 'ఆకలి కేక'ను దేశ వ్యాప్తంగా వినిపించామని గుర్తుచేశారు. ఆ ఉద్యమస్ఫూర్తి ఇప్పటికీ సజీవంగా ఉందన్నారు. కాపులకు మేలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ జీవో నెంబర్ 30ని జారీ చేసిందని, మేలు చేసిన పార్టీని ఓడించుకున్నామని ముద్రగడ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక దానిని మరిచారని విమర్శించారు.
రిజర్వేషన్లు అమలు చేసినా...కాపులు తమ వెంట ఉంటారా?...అనే అనుమానం చంద్రబాబులో ఉందని, అలాంటి అపోహలు చంద్రబాబు వీడాలని ఆయన సూచించారు. రాష్ట్రంలోని కాపు కులస్థులు ఎవరి సంచి వారిది అన్నట్లుగా ఆయా పార్టీల్లో మనుగడ సాగిస్తున్నారని ముద్రగడ చెప్పారు. మనమంతా ఒక కులానికి పుట్టాము తప్ప ఏ పార్టీకి కాదని వ్యాఖ్యానించారు.
అవసరమైతే రాజ్యాధికారం కోసం పోరాడాలని ముద్రగడ పిలుపునిచ్చారు. ఆ సమయం ఆసన్నమైందన్నారు. కులానికి నష్టం చేకూర్చే పనులు ఏ పార్టీలో ఉన్న కాపులూ చేయరాదని హితవు పలికారు.