కాపు చిచ్చు: చంద్రబాబుపై అమిత్ షా సీరియస్, పరిస్థితిపై ఆరా?
హైదరాబాద్: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆందోళన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిణామాలపై అమిత్ షా తన నేతలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
ఎపిలో ఏం జరుగుతోంది, ముద్రగడ ఉద్యమ ప్రభావం ఎంత, దీని వల్ల టిడిపి పరిస్థితి ఎలా మారింది వంటి విషయాలను ఆయన బిజెపి నేతలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంత మంది బిజెపి నాయకులు ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది.
క్యాస్ట్: అప్పుడు ఎన్టీఆర్, వైఎస్, ఇప్పుడు బాబు, జగన్
ముద్రగడ జనవరి 31వ తేదీన నిర్వహించిన కాపు ఐక్య గర్జనకు వెళ్లిన తమ పార్టీ నేత కన్నా లక్ష్మినారాయణపై చంద్రబాబు ప్రభుత్వం కేసు పెట్టడాన్ని బిజెపి అధిష్టానం తీవ్రంగా పరిగణనిస్తున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షంగా ఉంటూ తమకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా కన్నా లక్ష్మినారాయణపై కేసు నమోదు చేయడాన్ని అమిత్ షా తప్పు పట్టినట్లు చెబుతున్నారు.
ఆ విషయంపై టిడిపి నాయకులు బిజెపి నాయకత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడాన్ని తప్పు పడుతున్నట్లు తెలుస్తోంది. అమిత్ షా రాష్ట్ర నాయకులకు ఫోన్ చేసి పరిస్తితిని అడిగి తెలుసుకున్నట్లు చెబుతున్నారు. టిడిపిపై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందనే విషయంపై కూడా ఆయన ఆరా తీసినట్లు చెబుతున్నారు.
కేసుల నమోదులో చంద్రబాబు ప్రదర్శించిన వివక్షను కూడా రాష్ట్ర నాయకులు అమిత్ షా వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. తహసీల్దార్ వనజాక్షిపై టిడిపి ఎమ్మెల్యే చింతమనేని దాడి, కాల్ మనీ వంటి తీవ్రమైన ఆరోపణల్లో టిడిపి నేతలు ఇరుక్కోవడం, రాయలసీమలో అసంతృప్తి వంటి పలు విషయాల గురించి రాష్ట్ర నాయకులు ఆయనకు వివరించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై సమగ్ర నివేదికతో ఢిల్లీ రావాల్సిందిగా ఆయన ఎపి నేతలను అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది.