నన్ను అడుగుతావా, స్వార్థం తప్ప: చిరంజీవిపై భగ్గుమన్న చంద్రబాబు
విజయవాడ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి తనను ప్రశ్నించే నైతిక అర్హత ఉందా? అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కాపులకు మేలు చేసేందుకు పార్టీ పెడుతున్నానని ప్రజారాజ్యం పెట్టినప్పుడు చిరంజీవి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు బీసీలు, కాపుల కోసం పని చేస్తామని చిరంజీవి చెప్పారన్నారు. అలాంటి చిరంజీవి కాపుల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. అసలు చిరంజీవికి స్వార్థప్రయోజనాలు మినహా కాపుల సంక్షేమం ఏనాడైనా పట్టిందా అన్నారు. అలాంటి చిరంజీవి కాపుల కోసం చిత్తశుద్ధితో పని చేస్తున్న తనను ప్రశ్నించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ముద్రగడ దీక్ష ఎందుకు చేస్తున్నారో?: మంత్రులు
ముద్రగడ పద్మనాభం అసలు ఎందుకు దీక్ష చేస్తున్నారో చెప్పాలని మంత్రి నారాయణ గురువారం నాడుడిమాండ్ చేశారు. బీసీలు ఎప్పుడూ తెలుగుదేశం వైపే ఉన్నారని, ఇంటారని మరో మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. బీసీలకు నష్టం లేకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పారు.
ముద్రగడతో పాటు అందరికీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందని, దీక్షను విరమించుకోవాలని, కాపులకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. కాపులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. కమిషన్ నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తామన్నారు.
చంద్రబాబుతో భేటీ కానున్న కాపు కమిషన్ ఛైర్మన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు తగ్గకుండా కాపులను బీసీల్లో చేర్చేందుకు నియమితులైన కాపు కమిషన్ ఛైర్మన్ జస్టిస్ మంజునాథ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం కానున్నారు.
కమిషన్లో ఇప్పటివరకు ఆయన ఒక్కరే ఉన్నారు. మంజునాథ ఛైర్మన్గా ఉన్న కమిషన్లో మరో ముగ్గురు సభ్యులను నియమించనున్నారు. ఇందుకుగాను ప్రభుత్వానికి 15 దరఖాస్తులు అందాయి. వీటిల్లో ముగ్గురిని ఎంపికి చేసి నియామకంపై ఈరోజు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.