నాటి నుంచి జగన్ దాకా, మమ్మల్ని రెడ్లు అణగదొక్కారు: కాపు నేత సంచలనం
రాజమండ్రి: కాపులను రెడ్లు అణగదొక్కారన్నది వాస్తవమని, చరిత్ర తిరగేసి చూడాలని, నేను చెప్పింది తప్పయితే తనన గోదావరి గట్టున ఉరివేయాలని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామాంజనేయులు మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారని వార్తలు వస్తున్నాయి.
ఆయన తూర్పు గోదావరి జిల్లాలో మాట్లాడారు. దివంగత నీలం సంజీవ రెడ్డితో పాటు దివంగత ముఖ్యమంత్రులు కాసు బ్రహ్మానంద రెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి, ఇప్పుడు వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సైతం కాపులను అణగదొక్కారని ఆరోపించారు.
మెట్ల ముఖ చిత్రాలతో కాపుమిత్ర
మాజీమంత్రి దివంగత మెట్ల సత్యనారాయణ రావు ముఖచిత్రాలతో రూపొందించిన కాపుమిత్ర సంచికలను కోనసీమ ఐక్యకార్యాచరణ సమితి నాయకుల ఆధ్వర్యంలో ఆయన కుమార్తె, కాకినాడ ఎంపీ తోట నరసింహం సతీమణి తోట వాణి సోమవారం నాడు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి లేని లోటుని పూడ్చలేనిదన్నారు. కోనసీమకు ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అలాంటి మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రను కాపుమిత్ర సంచికలో చేర్చడం అభినందనీయమన్నారు.