నా వద్ద ఆధారాలు: జర్నలిస్ట్లకు ముద్రగడ క్షమాపణ, రివాల్వర్ అప్పగింత
తుని: మీడియా ప్రతినిధులకు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరోసారి క్షమాపణలు చెప్పారు. కాపు గర్జన సమయంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన విధ్వంసం సమయంలో మీడియా పైన కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు.
దీనిపై ముద్రగడను కొందరు విలేకరులు నిలదీశారు. ఆయన బుధవారం తునికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులు ముద్రగడను నిలదీశారు. ఈ సమయంలో వారితో ముద్రగడ అనుచరులు గొడవకు దిగే ప్రయత్నం చేశారు. వారిని ముద్రగడ శాంతింపచేశారు. అనంతరం మీడియాకు క్షమాపణలు చెప్పారు.
ఈ నెల 5 నుంచి ఆమరణ దీక్ష: ముద్రగడ
ఈ నెల 5 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తెలిపారు. ఈ లోగా జైల్లో పెడితే జైల్లోనే దీక్ష కొనసాగిస్తానన్నారు. తునిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చడంతో పాటు ఎన్నికల హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
తన అనుచరులు, కాపు కార్యకర్తలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని కోరారు. తునిలో దహనకాండకు ప్రభుత్వమే రూపకల్పన చేసిందన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ తమ వద్ద ఉన్నాయన్నారు. ప్రభుత్వ చర్యల కారణంగా బయట పెట్టలేకపోతున్నామన్నారు. ఉద్యమానికి, ఉద్యమకారులకు తాను అండగా ఉంటానని, ఒకరిని అరెస్ట్ చేస్తే వందమంది జైలుకు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
కాగా, తుని కేసుకు సంబంధించి 76 కేసులు నమోదు చేసిన పోలీసులు 'కాపు గర్జన'కు పిలుపునిచ్చిన కాపు నేత ముద్రగడ పద్మనాభం పైనా అభియోగాలు మోపారు.
బుధవారం తెల్లవారుజామున పోలీసులు ముద్రగడ ఇంటికి వెళ్లిన సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అక్కడ లభించిన ముద్రగడకు చెందిన రెండు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు, అతనే తన లైసెన్స్ రివాల్వర్ను ముద్రగడ కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో అప్పగించారని అంటున్నారు.