మేమే రూ.20 వేల కోట్లు ఇస్తాం...ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా?:జగన్ కు ముద్రగడ ప్రశ్న
విజయవాడ:కాపు రిజర్వేషన్లు ఇవ్వలేనని...కాపు కార్పొరేషన్కు మాత్రం రూ.10 వేల కోట్లు ఇస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తప్పుపట్టారు.
ఆదివారం గుడివాడ పట్టణంలో కాపు సేవాసమితి వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ముద్రగడ ప్రసంగిస్తూ జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. మేమే రూ.20 వేల కోట్లు ఇస్తాం...ఇతర కులస్థుడికి సీఎం పదవి ఇస్తారా? అంటూ జగన్ను ముద్రగడ ప్రశ్నించారు. అలాగే మా డిమాండ్లను పరిష్కరించిన పార్టీనే పల్లకీలో మోస్తామని ముద్రగడ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
మరోవైపు వైఎస్ జగన్ సతీమణి భారతిని ఈడీ నిందితురాలిగా పేర్కొన్న నేపథ్యంలో జగన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘాటుగా ప్రతిస్పందించారు. భారతిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్రెడ్డి సానుభూతి పొందాలని చూస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు.
భారతిపై ఈడీ కేసులు నమోదు చేస్తే...దానినీ జగన్ రాజకీయం చేస్తున్నారని మంత్రి పుల్లారావు విమర్శించారు. అలాగే తప్పుచేశాననే పశ్చాత్తాపం జగన్లో ఏమాత్రం కన్పించడంలేదన్నారు. జగన్కు ప్రజలపై ప్రేమ ఉంటే దోచుకున్న ధనాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని ప్రత్తిపాటి డిమాండ్ చేశారు.
Recommended Video
ఇక బీజేపీ ఎంపి జీవీఎల్ నరసింహారావు రాష్ట్ర ప్రభుత్వంపై అదే పనిగా బురదజల్లుతున్నారని మంత్రి పుల్లారావు ధ్వజమెత్తారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై అసత్యాలు ప్రచారం చేసి లబ్దిపొందాలనుకుంటున్నారని విమర్శించారు. కేంద్రం కుట్రలో జీవీఎల్ పావుగా ఉపయోగపడుతున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు.