జగన్కు ముద్రగడ చివరి లేఖ-అశోక్ వ్యవహారంలో అద్వానీ ఫొటోతో చురకలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికీ, మాన్సాస్ ఛైర్మన్, టీడీపీ నేత అశోక్ గజపతిరాజుకూ మధ్య సాగుతున్న మాటల యుద్ధం రోజూ చూస్తూనే ఉన్నాం. హైకోర్టు తీర్పు తర్వాత మాన్సాస్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అశోక్పై రోజుకో విధంగా వైసీపీ నేతలు మాటల దాడి సాగిస్తున్నారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
మాన్సాస్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు విషయంలో వైసీపీ సర్కారు అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇవాళ సీఎం జగన్కు ఓ లేఖ రాశారు. అంతటితో ఆగకుండా ఆ లేఖలో గతంలో బీజేపీ కురువృద్ధుడు లాల్కృష్ణ అద్వానీ అశోక్ గజపతిరాజును అభినందిస్తున్న ఓ ఫొటోను కూడా జత చేశారు. దీంతో అశోక్ను గతంలో అద్వానీ వంటి దిగ్గజ నేతలే గౌరవించారని జగన్కు ఆయన గుర్తుచేశారు.
తన లేఖలో ముందుగా జగన్కు నమస్కారాలతో మొదలుపెట్టిన ముద్రగడ.. ఆ తర్వాత ఈ ఉత్తరంలో విజయనగరం మహారాజా వారి కుమారులు అశోక్ గజపతిరాజు గారిని బీజేపీ అగ్రనాయకులు గౌరవ అద్వానీ గారు నాడు ఎలా గౌరవించారో చూడటం కోసం ఈ ఫొటో పంపుతున్నానన్నారు. ఇక లేఖలు పంపను. నిర్ణయం తమరిదే నంటూ ముద్రగడ వ్యాఖ్యానించారు.
ఈ ఒక్క ఫొటో ద్వారా అద్వానీని చూసి అశోక్ గజపతిరాజును ఎలా గౌరవించాలో నేర్చుకోమని ముద్రగడ పరోక్షంగా చెప్పినట్లు తెలుస్తోంది. మాన్సాస్ వ్యవహారంతో అశోక్పై నిత్యం బురదజల్లుతున్న వైసీపీ నేతలకు కాపు నేత ముద్రగడ లేఖ ఎక్కడో గుచ్చుకున్నట్లయింది.