జగన్కు కాపు నేతల సన్మానం, చంద్రబాబు ముందే చేయాల్సిందని కాపులు
రాజమహేంద్రవరం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మహిళలు సన్మానం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలంలో గురువారం జగన్ పాదయాత్ర కొనసాగింది.
కోల్కతా ర్యాలీకి టీడీపీకి మమత ఆహ్వానం, మోడీ నిర్ణయమే.. చేతులెత్తేసిన కేంద్రమంత్రి
ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గానికి చెందిన పలువురు మహిళలు ఆయనను కలిశారు. తమ కులానికి జగన్ ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్ఛాలు ఇచ్చి, శాలువా కప్పి సన్మానించారు. జగన్ను కలిసిన వారిలో వైసీపీ మహిళా నాయకురాళ్లు జక్కంపూడి విజయలక్ష్మి, రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, పద్మావతి తదితరులు కూడా ఉన్నారు.
జగన్ హామీపై హర్షం
తాము అధికారంలోకి వస్తే కాపు కార్పోరేషన్కు ప్రతి ఏడాది రూ.2వేలకోట్ల చొప్పున అయిదేళ్లలో రూ.10వేల కోట్ల నిధులు ఇస్తామని జగన్ ఇటీవల తన పాదయాత్రలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాపు రిజర్వేషన్లపై మాత్రం ఆయన తొలుత మాట్లాడుతూ.. అది కేంద్రం పరిధిలో ఉందని, తానేం చేయలేనని చెప్పారు. ఆ తర్వాత విమర్శలు రావడంతో తాము చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని ఆ తర్వాత చెప్పారు. జగన్ హామీపై కాపులు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైసీపీ అంటోంది.
చంద్రబాబు, జగన్లు కాపులను ఓటు బ్యాంకులుగా
కాపు రిజర్వేషన్లపై వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్లో విస్తృతస్థాయిలో చర్చ సాగుతోందని కాపు జేఏసీ నేత సత్యనారాయణ వేరుగా అన్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు తమకు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నాయన్నారు. గతంలో బలిజలకు రిజర్వేషన్లు ఇవ్వనని చెప్పిన జగన్, దానిని మేనిఫెస్టోలో పెట్టారని చెప్పారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు ఏదో సాకుతో ఇన్నాళ్లు కాలయాపన చేశారని మండిపడ్డారు. ఆ తర్వాత కేంద్రం పరిధిలో ఉందని జగన్ యూటర్న్ తీసుకున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు, జగన్లు కాపులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 24వ తేదీ లోపు కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.
ముద్రగడతో చర్చలు
ఇదిలా ఉండగా, కాపులకు పూర్తిస్థాయి రిజర్వేషన్లు కల్పించే వారికే తమ మద్దతు ఉంటుందని కాపు సంఘాల నాయకులు నిర్ణయించారు. కాపు రిజర్వేషన్ల అంశంపై ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలపై మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం బుధవారం కిర్లంపూడిలో కాపు జేఏసీ నేతలు, జిల్లాల కాపు సంఘాల నాయకులతో చర్చించారు.
చంద్రబాబు ముందే ఒత్తిడి చేస్తే
వైసీపీ అధ్యక్షులు జగన్ జగ్గంపేట, పిఠాపురం సభల్లో కాపుల రిజర్వేషన్లకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. అసలు జగన్ను కాపులకు రిజర్వేషన్లు ఇవ్వమని ఎవరు అడిగారని జేఏసీ నాయకులు ముద్రగడ వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కాపుల రిజర్వేషన్ల అంశంపై కేంద్రంతో పోరాడాలని టీడీపీ ఎంపీలకు చెప్పడం పైనా చర్చించారు. టీడీపీ ముందే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రిజర్వేషన్ల కోసం పోరాడాలని నిర్ణయించారు.