క్రీయాశీలకంగా కాపు నేతలు: ఐక్య వేదిక ఏర్పాటు దిశగా: గంటా శ్రీనివాస్, బొండా ఉమా కీరోల్
అమరావతి: రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా పూర్తిస్థాయిలో క్రియాశీకలంగా మారనున్నారు. ఏ పార్టీలో కొనసాగుతున్న కాపు నాయకులైనా సరే.. వారంతా ఏకం అయ్యేలా, ఐక్యంగా ఉండేలా ఓ వేదిక ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన కసరత్తు మొదలైంది. రాజకీయాలకు అతీతంగా కాపు నాయకులందరూ ఏకతాటిపైకి వచ్చేలా ప్రత్యేకంగా ఓ ఐక్య వేదికను చేసుకునే దిశగా అడుగులు పడుతున్నాయి.
ఐక్యత కోసం..
రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం బలమైనదనడంలో సందేహాలు అక్కర్లేదు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ- ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో కాపు ఓటుబ్యాంకు ఉంది. ఉత్తరాంధ్ర సహా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గం మరింత బలంగా ఉంటోంది. ఆ సామాజిక వర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించే నాయకులందరూ వేర్వేరు పార్టీల్లో కొనసాగుతుండటం వల్ల వారి మధ్య ఐక్యత కొరవడిందనే అభిప్రాయాలు లేకపోలేదు.
రాజకీయాలకు అతీతంగా..
కాపు ఓటుబ్యాంకునకు సరైన దిశానిర్దేశం చేసే నాయకుడు లేరనే వాదనలు ఉన్నాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాలు, పార్టీలకు అతీతంగా ఏకం కావాలని కాపు నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఓ ఐక్య వేదికను ఏర్పాటు చేసుకోవాలని.. రాజకీయ, సామాజిక, ఆర్థిక పరంగా తమ సామాజికవర్గానికి చెందిన ప్రజల ప్రయోజనాలు, డిమాండ్లను నెరవేర్చుకునే అన్ని రాజకీయ పార్టీలపైనా ఒత్తిళ్లను తీసుకుని రావాలనేది వారి భవిష్యత్ ప్రణాళికగా చెబుతున్నారు.
పాల్గొన్న నాయకులు వీరే..
ఇందులో భాగంగా- వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న కాపు నాయకులందరూ మరోసారి సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు గంటా శ్రీనివాస్, కాంగ్రెస్ మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, టీడీపీకే చెందిన మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు, ఇందులో పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారులు రామ్మోహన్, ఎంవీజీకే భాను, మాజీ ఐపీఎస్ సాంబశివరావు సహా అన్ని జిల్లాల కాపు ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ భేటీ సాగింది.
కాపు ఐక్యవేదిక ఏర్పాటుపై..
ఈ సమావేశానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కాపు నాయకులు హాజరు కాలేదని చెబుతున్నారు. కాపు ఐక్య వేదిక ఏర్పాటుపై ప్రధానంగా చర్చ సాగింది. దీని రూపు రేఖలు ఎలా ఉండాలనే విషయం.. వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. గంటా శ్రీనివాస్, వట్టి వసంత్ కుమార్, బొండా ఉమామహేశ్వర రావు వంటి అనుభవం ఉన్న రాజకీయ నాయకులు తోడుగా 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ ఐక్య వేదికను క్రియాశీలకంగా మార్చుకోలనేది భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికగా ఉండొచ్చని తెలుస్తోంది.
ఒత్తిళ్లకు తలొగ్గకుండా..
కాపు ఐక్య వేదిక ఏర్పాటుపై ఓ స్పష్టత వచ్చిన తరువాత.. దీన్ని అధికారికంగా ప్రకటించాలని, దీనికోసం విజయవాడలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కాపు నాయకులు వచ్చారు. ఈ వేదికను ఏర్పాటు చేసుకున్న తరువాత.. దీన్ని విజయవంతం చేయడంపైనా వారు చర్చించారు. పార్టీల అగ్రనాయకత్వం నుంచి వచ్చే ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కాపు సామాజిక వర్గ ఓటుబ్యాంక్ ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.