జగన్కు 'కాపు' షాక్, ఉద్రిక్తత: 200 రోజులు అగండి.. చుక్కలు చూపిస్తాం: కొడాలి నాని
Recommended Video
అమరావతి: కాపులకు రిజర్వేషన్లపై చేతులెత్తేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తన ప్రజా సంకల్ప యాత్రలో ఆదివారం షాక్ తగిలింది. ఆయన యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో సాగుతోంది. గతంలో కాపు రిజర్వేషన్లకు అనుకూలంగా మాట్లాడి, ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని కాపు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాపు రిజర్వేషన్లపై ప్రకటన, జగన్ను ఏకిపారేసిన ముద్రగడ
ఇప్పటికే మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తాజాగా, జగన్ యాత్రకు కాపు సెగ తగిలింది. జిల్లాలోని కిర్లంపూడి మండలం గోనెడలో జగన్ పాదయాత్రను కాపు నాయకులు అడ్డుకున్నారు. జగన్కు వ్యతిరేకంగా, కాపులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. కాపులను మోసం చేయవద్దని నినాదాలు చేశారు.
కాపు యువతను పక్కకు నెట్టిన జగన్ సిబ్బంది
జగన్ పాదయాత్రను కాపు యువత, కాపు నాయకులు అడ్డుకోవడంతో ప్రతిపక్ష నేత సెక్యూరిటీ సిబ్బంది వారిని పకక్కు నెట్టేసింది. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.ఆదివారం మధ్యాహ్నం గోనాడ పాదయాత్ర శిబిరం నుంచి జగన్ బయలుదేరిన 10 నిమిషాల్లోనే గోనాడలో కాపు నాయకులు, యువత ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జగన్ వారందరికీ అభివాదం చేసుకుంటూ పాదయాత్ర ముందుకు సాగారు. కాపు రిజర్వేషన్ల అంశం తన పరిధిలోలేదని, వాటిపై తాను హామీ ఇవ్వలేనని జగన్ జగ్గయ్యపేట సభలో చెప్పిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం పరిధిలో ఉన్న ఇతర అంశాలపై ఎలా పోరాడుతున్నారని కాపు నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. పైగా, గతంలో కాపులకు హామీ ఇచ్చి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు.
200 రోజులు ఆగితే మీకు చుక్కలు చూపిస్తా
ఇదిలా ఉండగా, వైసీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుడివాడలోని శరత్ థియేటర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో నాని మాట్లాడారు. మరో 200 రోజులు ఆగితే గుడివాడలో టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తానని తీవ్రంగా హెచ్చరించారు. పోలీసులు, అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారారని ఆరోపించారు.
రాజకీయ జీవితం లేకుండా చేస్తానని హెచ్చరిక
తనను గుడివాడ నుంచి తరిమికొడతామని టీడీపీ నేతలు చెప్పడంపై విడ్డూరంగా ఉందని కొడాలి నాని అన్నారు. ఇంకో 200 రోజులు ఆగితే గుడివాడలో టీడీపీని భూస్థాపితం చేస్తానని చెప్పారు. అప్పుడు టీడీపీ నేతలను ప్రజలు తరిమితరిమి కొడతానన్నారు. వైసీపీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్న నేతలకు అసలు రాజకీయ జీవితమే లేకుండా చేస్తానని హెచ్చరించారు.
టీడీపీ నేతల ఆగ్రహం
కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన వ్యాఖ్యలను కాపు నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా తప్పుబడుతున్నారు. జగన్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడులు విమర్శించారు. ఇతర అంశాలపై కూడా జగన్కు అవగాహన లేదని దేవినేని మండిపడ్డారు. జగన్కు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏ మాత్రమూ కంటికి కనిపించడం లేదని, ఆయన తన నిజస్వరూపాన్ని రోజుకు కాస్త చొప్పున ప్రజల ముందు ఉంచుతున్నారని మంత్రి దేవినేని మండిపడ్డారు. రాజధానిని భ్రమరావతి అంటూ రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అపహాస్యం చేస్తున్నారని, పోలవరం పనులు, అమరావతిలో నిర్మాణాలు జగన్కు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. పులివెందులకు జగన్ ఏం చేశాడో చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలే ప్రోగ్రెస్ రిపోర్టును ఇస్తారని, బీజేపీతో కుమ్మక్కై, తన ఎంపీలతో రాజీనామా చేయించి ఇంట్లో కూర్చోబెట్టిన ఘనత ఆయనదే అన్నారు. బీజేపీతో లోపాయకారీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న జగన్ నిజస్వరూపాన్ని ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. జగన్తో పాటు ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించేందుకు పవన్ బయలుదేరారని, వారిద్దరూ బాధ్యతా రాహిత్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు.