బాబుపై ఎదురుదాడే: చిరు, దాసరి సహా కాపు నేతల భేటీ
హైదరాబాద్: కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై కాపు నాయకులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలకు అతీతంగా వారు ఏకం కావడానికి ప్రయత్నిస్తున్నారు.
కాపు నాయకులంతా హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, దాసరి నారాయణ రావు, చిరంజీవి, బొత్స సత్యనారాయణ, సి. రామచంద్రయ్య, అంబటి రాంబాబు, కన్నబాబు, దాడిశెట్టి రాజాలతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
ముద్రగడ పట్ల చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని ఈ సమావేశంలో తప్పు పట్టినట్లు తెలుస్తోంది. కాపులపై చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు మండిపడినట్లు చెబుతున్నారు. తుని ఘటన వెనక రాయలసీమ వ్యక్తుల హస్తం ఉందని చంద్రబాబు ప్రకటించారని, అయితే ఇప్పుడు గోదావరి జిల్లాలకు చెందినవారిని మాత్రమే అరెస్టు చేస్తున్నారని వారు ఆగ్రహించినట్లు సమాచారం.
దీక్ష చేస్తున్న ముద్రగడను, ఆయన భార్యను పోలీసులు ఈడ్చుకు వెళ్లిన తీరును, ముద్రగడ కుమారుడిని కొట్టిన వైనాన్ని వారు తప్పు పట్టారు. కాపు ఉద్యమానికి సంబంధించిన భవిష్యత్తు కార్యాచరణపై కూడా వారు చర్చించినట్లు సమాచారం. టిడిపికి చెందిన కాపు నాయకులు తప్ప మిగతా పార్టీల్లోని కాపు నాయకులంతా ఏకం కావడం ఏ మలుపు తీసుకుంటుందనే ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. చంద్రబాబు కుటుంబం కూడా కాపు నేతలు భేటీ అయిన పార్క్ హయత్ హోటల్లోనే నివాసం ఉంటుండడం కొసమెరుపు.